
WE HUB : హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మహిళా వ్యాపారులకు సింగిల్ విండో విధానం అమలు చేస్తామని మంత్రి కేటీఆర్( Minister KTR ) చెప్పారు. హోటల్ తాజ్ కృష్ణా( Taj Krishna ) వేదికగా వీ హబ్( WE HUB ) 5వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీ హబ్ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. రూ.1.30 కోట్లు ఇస్తే వీ హబ్ నుంచి ఒక స్టార్టప్తో రూ.70 కోట్లకు పెంచారని, స్త్రీ నిధి కింద మహిళలకు రుణాలు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రూ. 750 కోట్లు వడ్డీ లేని రుణాలు విడుదల చేస్తున్నామన్నారు. యువత ఎందుకు వ్యాపారవేత్తలు అవ్వకూడదని ప్రశ్నించారు. ప్రతి పారిశ్రామిక పార్కులో 10 శాతం ప్లాట్స్ మహిళలకు కేటాయించామని తెలిపారు. ప్రతీ మూడు కోవిడ్ టీకాల్లో రెండు హైదరాబాద్ నుంచే వచ్చాయని కేటీఆర్ గుర్తు చేశారు.
మానవ వనరులు, సాంకేతికతను వినియోగించుకుంటే అభివృద్ధి సాధ్యం అవుతుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. అమ్మాయిలు వ్యాపార రంగంలో రాణించాలన్నారు. మన పిల్లలకు చిన్నప్పట్నుంచే విలువలు నేర్పించాలని కోరారు. తల్లిదండ్రుల వ్యవహారశైలి పిల్లలపై ప్రభావం చూపుతుందని, పిల్లల్ని ఎలా పెంచుతామనేది ప్రధానం అని చెప్పారు. తల్లిదండ్రులు అమ్మాయిలు, అబ్బాయిల మధ్య వివక్ష చూపించరాదన్నారు. సమానంగా చూడటం మన ఇంటి నుంచే ప్రారంభిస్తే.. వారు కూడా ఇతర అమ్మాయిల్ని, అబ్బాయిల్ని సమానంగా, గౌరవంగా చూస్తారని కేటీఆర్ సూచించారు.