కోనాపూర్ కు ఏమడిగితే అదివ్వాలని కేసీఆర్ అన్నరు

కోనాపూర్ కు ఏమడిగితే అదివ్వాలని కేసీఆర్ అన్నరు

కామారెడ్డి: మానేరు ప్రాజెక్టుకు మాకు అవినాభావ సంబంధం ఉందన్నారు మంత్రి కేటీఆర్. మంగళవారం ఆయన కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. బీబీపేట మండలం కోనాపూర్ , కొదురుపాక గ్రామాల్లో స్కూల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. . నాన‌మ్మ‌, అమ్మమ్మల జ్ఞాప‌కార్థంగా మ‌న ఊరు – మ‌న బ‌డి ప్రోగ్రాం కింద త‌న సొంత ఖ‌ర్చుల‌తో పాఠ‌శాల‌ల‌ను నిర్మిస్తున్న‌ట్లు కేటీఆర్ తెలిపారు. మా నానమ్మ, అమ్మమ్మ ఊళ్ళల్లో పాఠశాలలు స్వంతంగా నిర్మించే అవకాశం రావడం  అదృష్టమన్నారు. అప్పర్ మానేరు నిర్మాణంలో మా నానమ్మకు చెందిన వందల ఎకరాలు కోల్పోయామని.. మానేరు ప్రాజెక్టుకు మాకు అవినాభావ సంబంధం ఉందన్నారు. మా కుటుంబ చరిత్ర తెలుసుకోకుండా మా మీద నిందలు వేస్తున్నారని.. కొందరు కేసీఆర్ గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు.

కేసీఆర్ పుట్టుకతోనే భూస్వామి అన్న కేటీఆర్.. 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. 60 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రైతుబందు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రాన్ని సస్యశామలం చేశామని తెలిపారు. ఇంటింటికి నీళ్లు, 24 గంటల కరెంట్, పెన్షన్లు.. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ దామల నిర్మాణాలు చేశామని తెలిపారు. 60 ఏళ్లల్లో జరగని అభివృద్ధి 7 ఏళ్ళల్లో చేశామని.. చిల్లర మాటలను పట్టించుకొమన్నారు. సాగు, తాగు నీరు అందిస్తున్నామని తెలిపారు. రూ.7320 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో 26 వేల పాఠశాల లను మన ఊరు- మన బడి కార్యక్రమంలో అభివృద్ధి చేస్తున్నామని.. కొనాపూర్ ను పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేసి.. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. తెలంగాణలో కార్పోరేట్ స్థాయిలో పాఠశాలలను అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కోనాపూర్ కు ఏమడిగితే అదివ్వాలని కేసీఆర్ అన్నారని చెప్పుకొచ్చారు.