చీమలపాడు క్షతగాత్రులకు మంత్రి కేటీఆర్ భరోసా

చీమలపాడు క్షతగాత్రులకు మంత్రి కేటీఆర్ భరోసా

చీమలపాడు ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు మంత్రి కేటీఆర్. ఏప్రిల్ 13వ తేదీ గురువారం నిమ్స్ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి..డాక్టర్ బృందంతో మాట్లాడి క్షతగాత్రులకు ఏ విధంగా వైద్య సేవలు అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. 

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆ పార్టీ నాయకుల అత్యుత్సాహం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. కారేపల్లి మండల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని బుధవారం చీమలపాడులో ఏర్పాటు చేశారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్ హాజరయ్యారు. పూలు చల్లుకుంటూ, డప్పులు కొట్టుకుంటూ, పటాకులు పేల్చుతూ వారికి బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. పటాకులు కాల్చడంతో నిప్పురవ్వలు దగ్గర్లో ఉన్న గుడిసె మీద పడ్డాయి. గుడిసెకు తాళం వేసి ఉండటం.. గాలి కారణంగా మంటలు మొదలయ్యాయి.

మరోవైపు అప్పటికే సభావేదిక దగ్గరకు చేరుకున్న ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్.. ఆత్మీయ సమ్మేళనాన్ని ప్రారంభించారు. స్థానికులు బకెట్లతో నీళ్లు తీసుకువచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తూనే.. గ్రామానికి చెందిన వాటర్ ట్యాంకర్‌‌‌‌ను తెప్పించారు. అయితే గుడిసె లోపల ఉన్న సిలిండర్‌‌ను ఎవరూ గమనించలేదు. మంటలు పెరిగిపోయి.. లోపల ఉన్న గ్యాస్​ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది.

ఆ ధాటికి మంటలు ఆర్పుతున్న వారి కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. పది మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే పోలీస్ వాహనాల్లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ చేసి ఒకరికి రెండు కాళ్లు, మరో ముగ్గురికి ఒక్కో కాలు చొప్పున డాక్టర్లు తొలగించారు. ముగ్గురిని హైదరాబాద్​కు తరలించి నిమ్స్​లో చికిత్స అందిస్తున్నారు.