రాజన్న సిరిసిల్ల జిల్లా : లాక్ డౌన్ కారణంగా అన్ని దేశాలకు ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడిందన్నారు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. ఈ క్రమంలోనే మార్చి, ఏప్రిల్ నెలల్లో రాష్ట్ర ఆదాయం 95 శాతం తగ్గిందన్నారు. ఇంత సంక్షోభంలోనూ రైతులకు రూ. 1,200 కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాచర్ల బొప్పాపూర్ లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన కేటీఆర్.. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతులు అనేక కష్టాలు పడ్డారన్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయం ఎట్లా ఉందో రైతులందరికీ తెలుసని.. పెట్టుబడికి, విత్తనాలకు, ఎరువులకు, నీళ్లకు కరెంట్ కు కొదవ లేదన్నారు. సీఎం కేసీఆర్ కృషితో ఎండకాలంలోనూ చెరువులన్నీ మత్తడి దుంకుతున్నాయని.. రైతులు నిర్భయంగా సేద్యం చేసుకునేందుకు అన్ని రకాల వసతులు కల్పించామన్నారు. ఎరువులు, విత్తనాలు అందించేందుకు సీఎం ఆర్థిక చేయూత అందించారని.. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్.