
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం నూతన శోభను సంతరించుకొనుంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు శుక్రవారం సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా అథ్లెటిక్ సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రూ 8.50 కోట్లతో యువ క్రీడాకారుల కోసం మంత్రి ప్రత్యేక చొరవతో ఈ ట్రాక్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ట్రాక్ నిర్మాణానికి కాంగ్రెస్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీంతో ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం జాతీయ. అంతర్జాతీయ అథ్లెటిక్స్ కు వేదిక కానుంది. జిల్లా కేంద్రంలో కోట్లాది రూపాయలతో నిర్మిస్తున్న సింథటిక్ ట్రాక్ వల్ల క్రీడాకారులు నైపుణ్యాన్ని పెంచుకునేందుకు అవకాశం దొరుకుతుంది. ఖమ్మం నగరంలో ట్రాక్ ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు క్రీడాభిమానులు కృతజ్ఞతలు తెలిపారు.