V6 News

అమరావతిలో రైతులకు ఇచ్చిన ప్లాట్లపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు...

అమరావతిలో రైతులకు ఇచ్చిన ప్లాట్లపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు...

అమరావతిలో రైతులకు ఇచ్చిన ప్లాట్లపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారాయణ. మంగళవారం ( డిసెంబర్ 9 ) మీడియాతో మాట్లాడిన ఆయన ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌళిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని.. రెండేళ్లలో   డ్రైనేజ్ లు, రోడ్లు,ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తి అవుతాయని అన్నారు నారాయణ. సీడ్ యాక్సిస్ రోడ్డును మంగళగిరి రహదారికి అనుసంధానించి త్వరలోనే అందుబాటులో కి తెస్తామని తెలిపారు.

అవసరమైన ప్రాజెక్టులకు అనుగుణంగా తదుపరి భూసమీకరణ చేపడతామని.. లంక భూములు, అసైన్డ్ భూముల్ని సమీకరణకు తీసుకున్నవారి సమస్యను వచ్చే మంత్రివర్గ సమావేశంలో పరీష్కరిస్తామని స్పష్టం చేశారు. రైతులకు ఇచ్చిన ప్లాట్లు ఉన్న 11, 8జోన్ల లో మినహా అమరావతి పరిధిలోని 29 గ్రామాల పరిధిలో పనులు వేగంగా సాగుతున్నాయని అన్నారు. 

రైతులకు ఇచ్చిన 66వేల ప్లాట్లలో 7వేల ఫ్లాట్స్ మాత్రమే ఇంకా రిజిస్ట్రేషన్ లు చేయాల్సి ఉందని.. రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ రోజుకు 30నుంచి 60మంది చేసుకుంటున్నారని అన్నారు నారాయణ. 450మంది రైతులకు ఇవ్వాల్సిన  1891 ఫ్లాట్స్ కుటుంబ సభ్యుల సమస్యలు ఉన్నవి ఉన్నాయని.. విదేశాల్లో ఉన్న వాటితో పాటు ఇతరత్రా రిజిస్ట్రేషన్ లు రోజుకు వెయ్యి చేసేలా అధికారులను అందుబాటులో పెట్టామని అన్నారు. రైతులు ముందుకొచ్చి ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు మంత్రి నారాయణ.