పాడైంది పన్ను కాదు వెన్నెముక.. కేసీఆర్​పై మంత్రి పొంగులేటి ఫైర్

పాడైంది పన్ను కాదు వెన్నెముక.. కేసీఆర్​పై మంత్రి పొంగులేటి ఫైర్
  • కేసీఆర్ అవినీతి జబ్బు మేడిగడ్డకే కాదు అన్నారం, సుందిళ్లకు కూడా పాకింది
  • నీచమైన భాషకు  ఆద్యుడు కేసీఆరే
  • కాళేశ్వరం.. కేసీఆర్​ అవినీతి, అహంకారం, మూర్ఖత్వానికి 
  • నిదర్శనమని మండిపాటు

హైదరాబాద్ , వెలుగు: పాడైంది పన్ను అయితే బాగుండేది కానీ.. కేసీఆర్ అవినీతికి బలైంది కాళేశ్వరానికి వెన్నెముకలాంటి మేడిగడ్డ అని, మనిషికి వెన్నెముక ఎంత ముఖ్యమో కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ కూడా అంతే ముఖ్యమని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి ఫైర్​ అయ్యారు.  మనిషి శరీరంలో కాళ్లు, చేతులు, ముక్కు, ముఖం..  ఇలా అన్ని బాగానే ఉన్నా వెన్నెముక విరిగిపోతే ఎలా ఉంటుందో ఇప్పుడు కాళేశ్వరం పరిస్థితి కూడా అలాగే ఉందని తెలిపారు. 

మేడిగడ్డ తర్వాత అన్నారం, సుందిళ్ల పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నదని బుధవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో శ్రీనివాస్​రెడ్డి ఆరోపించారు. కేసీఆర్  అవినీతి జబ్బు ఒక మేడిగడ్డకే  పరిమితం కాలేదని, ఆ జబ్బు అన్నారం, సుందిళ్లకు కూడా పాకిందని చెప్పారు. తానే ఇంజనీర్, డిజైనర్, తాపీ మేస్త్రి అనే విధంగా కేసీఆర్​ వ్యవహరించారని, కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్​  అవినీతికి, అహంకారానికి, మూర్ఖత్వానికి నిదర్శనమని విమర్శించారు.  

ఒక్క పన్ను పాడైతే అన్ని  పండ్లు పీకేసుకుంటామా, ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని పేర్కొన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్ట్ వెన్నెముక అయిన మేడిగడ్డ బ్యారేజీ మొత్తం 22 పిల్లర్లలో దాదాపు 7 పిల్లర్లు 3 ఫీట్ల మేరకు కుంగాయని  సాక్షాత్తు ఎన్ డీ ఎస్ ఏ , కేంద్ర ప్రభుత్వ జల వనరుల నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ నిపుణులు, రిటైర్డ్ ఇంజనీరింగ్ అధికారులు, మేధావులు, రైతు సంఘాల నేతలు, ప్రజా ప్రతినిధులు, వివిధ పత్రికల ఎడిటర్లు, జర్నలిస్టులు అందరూ ఏకరువు పెడుతుంటే.. అపర మేధావి కేసీఆర్ మాత్రం సమస్యను చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. 

శాసనసభలో సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన చర్చలో పాల్గొనకుండా పారిపోయిన పెద్దమనిషి.. 80 వేల పుస్తకాలు చదివిన మేధావి.. కాళేశ్వరం రూపశిల్పి ఇప్పుడు టీవీల ముందుకు వచ్చి  ప్రాజెక్టుపై మాట్లాడుతా అనడం హాస్యాస్పదంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. 
 
బీఆర్​ఎస్​ తప్పులను కాంగ్రెస్​పై రుద్దే యత్నం

భూమి, ఆకాశం ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ ఉంటుందని  కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై పొంగులేటి స్పందించారు. టీఆర్ఎస్ స్థానంలో కేసీఆర్  ఏర్పాటు చేసిన బీఆర్ఎస్  ఏమైందో అందరికీ తెలుసని,  దేశంలో గత్తర లేపుతా,  భూకంపం సృష్టిస్తా అని చెప్పిన వ్యక్తి దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ పోటీ చేయలేక చేతులెత్తేశారని, ఉన్న రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్  కుర్చి మడత పెట్టారని ఎద్దేవా చేశారు. 

రాబోయే రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా బీఆర్ఎస్ కు అభ్యర్థులు దొరకని దుస్థితి వచ్చిందని అన్నారు. కేసీఆర్  పాలనలో జరిగిన పాలనాపరమైన తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘కరువుకు, కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సంబంధం ఉన్నదా?  మా ప్రభుత్వం డిసెంబర్ 7వ తేదీన ఏర్పడింది. 

అప్పటికే వానకాలం సీజన్ ముగిసిన విషయం కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావుకు తెలియదా?’ అని పొంగులేటి ప్రశ్నించారు. ప్రజలు అత్యాశకు పోయారంటూ ప్రజాతీర్పును కేసీఆర్ చులకన చేస్తున్నారని, తనకు ఓటు వేసినంత కాలం ప్రజలు మంచివారు, వ్యతిరేకంగా ఓటు  వేస్తే మాత్రం ప్రజలకు తెలివిలేదు.. మూర్ఖులు అన్నట్టుగా కేసీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పును ఆమోదిస్తున్నాం అని ఇంత వరకు కేసీఆర్​ ఎందుకు అనడం లేదని ప్రశ్నించారు.  కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను కాపీ చేసి  రూ.400కు సిలిండర్ ఇస్తానంటే కూడా కేసీఆర్ హామీలను ప్రజలు నమ్మలేదని అన్నారు. సీఎం రేవంత్​రెడ్డి భాష గురించి కేసీఆర్ మాట్లాడటం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టేనని ఎద్దేవాచేశారు.  పీకడానికి , తోక  మట్ట  బొందలగడ్డ, సన్యాసి, రండ  వంటి పదాలను అలవోకంగా వదిలేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాజకీయాల్లో  నీచమైన భాష, తిట్ల ప్రయోగాలకు కేసీఆర్ ఆద్యుడని, ఈ విషయం ప్రజలందరికీ తెలుసునని అన్నారు.