
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమ కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన జర్నలిస్టులకు అందేలా విధివిధానాలను రూపొందిస్తున్నామని చెప్పారు. బుధవారం సెక్రటేరియెట్లో మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ సీహెచ్ ప్రియాంక, సీపీఆర్వో మల్సూర్తో కలిసి అక్రిడిటేషన్ పాలసీపై సుదీర్ఘంగా చర్చించారు.
అర్హులైన జర్నలిస్టుల గౌరవాన్ని కాపాడేలా శాస్త్రీయ పద్ధతిలో అక్రిడిటేషన్ పాలసీ ఉండాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా అక్రిడిటేషన్ కార్డులను జారీ చేయడానికి ఈ నెల చివరినాటికి పాలసీ విధివిధానాలను కొలిక్కి తీసుకురావాలని సూచించారు. కాగా, సెక్రటేరియెట్లో మంత్రిని డిప్యూటీ కలెక్టర్ల నుంచి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందిన 13 మంది అధికారులు కలిసి, కృతజ్ఞతలు తెలిపారు.