ప్రతిరోజూ 15 వేల పెండింగ్ ధరణి దరఖాస్తులకు పరిష్కారం: పొంగులేటి

ప్రతిరోజూ 15 వేల పెండింగ్ ధరణి దరఖాస్తులకు పరిష్కారం: పొంగులేటి
  • 6 రోజుల్లో 76 వేల అప్లికేషన్లకు పరిష్కారం: మంత్రి పొంగులేటి

హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఏదో ఒక కుటుంబం ధరణి పోర్టల్‌‌‌‌తో సమస్యలను ఎదుర్కొంటుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి అన్నారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ధరణికి సంబంధించి గత ప్రభుత్వంలో 2,46,536 లక్షల దరఖాస్తులు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయని, వీటి పరిష్కారానికి ఈ నెల 1 నుంచి ఎమ్మార్వో స్థాయిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇందులో 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ స్థాయిలో 76,382 దరఖాస్తులను పరిష్కరించామని మంత్రి తెలిపారు.

రోజుకు 15 వేలకు పైగా దరఖాస్తులను పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. ప్రధానంగా పెండింగ్ మ్యూటేషన్‌‌‌‌కు సంబంధించి 15,070 దరఖాస్తులకు గాను 5,471 పరిష్కరించామన్నారు. గ్రీవెన్స్ ఆఫ్ ల్యాండ్ మ్యాటర్ 40,605 దరఖాస్తులకు గాను 17,372, పాస్ బుక్ డేటా కరెక్షన్‌‌‌‌కు సంబంధించి 1,01,132 దరఖాస్తులకు గాను 27,047 పరిష్కరించామని చెప్పారు. కోర్టు కేసులకు సంబంధించి 27,672 దరఖాస్తులకు గాను 9,883 సాల్వ్‌‌‌‌ చేశామన్నారు.