ఆందోళన వద్దు .. అర్హులందరికీ ఇండ్లు ఇస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఆందోళన వద్దు .. అర్హులందరికీ ఇండ్లు ఇస్తాం : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఖమ్మం రూరల్, వెలుగు :  ఎవరూ ఆందోళన చెందవద్దని, అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఏదులాపురం మున్సిపాలిటీలోని నాయుడుపేట జంక్షన్​ టీసీవీ రెడ్డి ఫంక్షన్​ హాల్​లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు.  అనంతరం  ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60వ డివిజన్ రామన్నపేటలో మున్సిపల్​ సాధారణ నిధులు రూ. కోటితో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు, ఖమ్మం రూరల్ మండలంలో పలు రోడ్డు నిర్మాణ పనులకు, దారేడు నుంచి కోటపాడు వరకు రూ. 4 .90 కోట్లు, దారేడు నుంచి కోయచిలకకు రూ. 3,74 కోట్లు, మద్దివారి గూడెం నుంచి పోలిశెట్టి గూడెం వరకు రూ. 3.30 కోట్లు, తీర్థాల నుంచి మద్దివారిగూడెం వరకు రూ. 4.29 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.  

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ. 22,500 కోట్లతో ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కల సాకారం కోసం కృషి చేస్తోందన్నారు. ప్రతీ సంవత్సరం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఉంటుందని, నిరంతర ప్రక్రియగా ఇందిరమ్మ ఇండ్ల పథకం కొనసాగుతుందని, 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ఇప్పుడు శంకుస్థాపన చేసుకున్న రోడ్ల పనులన్నీ వారంలోగా ప్రారంభమవుతాయన్నారు. 

నాణ్యతగా ఇన్​టైంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గత పాలకులు చేసిన అప్పులకు ప్రతినెలా రూ. 6,500 కోట్లు అసలు, వడ్డీ చెల్లిస్తూ, తాము ఇచ్చిన  హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఆర్డీవో నరసింహారావు, ఖమ్మం రూరల్ తహసీల్దార్ రాంప్రసాద్, ప్రజాప్రతినిధులు, డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

చేగొమ్మలో రూ.9.63కోట్లతో అభివృద్ధి పనులు

కూసుమంచి, వెలుగు : మండలంలోని చేగొమ్మ గ్రామంలో రూ.9.63 కోట్లతో పలు అభివృద్ధి పనులకు బుధవారం మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. అందులో గట్టుసింగారం అంతర్గత సీసీ రోడ్డు, చేగొమ్మలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదులు,  గైగొల్లపల్లి నుంచి బచ్చోడు వరకు బీటీ రోడ్డు, పాలేరులో సీసీ రోడ్డు, జడ్పీహెచ్​ఎస్​లో అదనపు తరగతి గదులు, నాయకన్ గూడెంలో సూర్యాపేట–- అశ్వారావుపేట రోడ్డు రిపేరు పనులు ఉన్నాయి. 

అంతకుముందు కూసుమంచి మండల కేంద్రంలో పాత జడ్పీహెచ్​ఎస్​ స్థానంలో జూనియర్ కాలేజీ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. కూసుమంచి క్యాంప్ ఆఫీస్​లో నేలకొండపల్లి, కూసుమంచి మండలాలకు చెందిన 348 మంది లబ్ధిదారులకు రూ.1.06కోట్ల విలువైన సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు పంపిణీ చేశారు. మంత్రి వెంట ఖమ్మం ఆర్డీవో నరసింహా రావు, ఎంపీపీఎస్ స్కూల్ హెడ్ మాస్టర్, తహసీల్దార్ రవికుమార్ ఉన్నారు.