కాళేశ్వరంపై విజిలెన్స్ ఎంక్వైరీతో బీఆర్ఎస్ లీడర్లలో దడ : మంత్రి పొన్నం ప్రభాకర్

కాళేశ్వరంపై విజిలెన్స్ ఎంక్వైరీతో  బీఆర్ఎస్ లీడర్లలో దడ : మంత్రి పొన్నం ప్రభాకర్
  • బీఆర్ఎస్​ను కాపాడేందుకు కిషన్ రెడ్డి ప్రయత్నం : మంత్రి పొన్నం

కరీంనగర్, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ ఎంక్వైరీ మొదలుపెట్టగానే బీఆర్ఎస్ లీడర్లలో దడ పుడుతోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రూ.లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు 9 నెలలు కూడా పనిచేయలేదని విమర్శించారు. ప్రాజెక్టు అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని చెప్పామని, దీంతో బీఆర్ఎస్ ను కాపాడేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని పొన్నం ఆరోపించారు.

కరీంనగర్ సిటీలోని ఉమెన్స్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో మంత్రి పొన్నం బుధవారం మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా వాకర్స్ తో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చి నెలరోజులు మాత్రమే అవుతోందని, గ్యారంటీ స్కీమ్​లపై దరఖాస్తులు స్వీకరించామని, చిత్తశుద్ధితో వాటిని అమలు చేస్తామని స్పష్టం చేశారు.

మాజీ ఎంపీ వినోద్ కుమార్ సచ్చీలుడైతే తనపై వచ్చిన ఆరోపణపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. జెన్ కోతోపాటు ఇతర డిపార్ట్​మెంట్లలో అక్రమంగా ఉద్యోగం పొందిన వారు వెంటనే ఉద్యోగాలు వదిలిపెట్టి వెళ్లాలన్నారు. త్వరలో భూ అక్రమాలపై కూడా చర్యలు చేపడుతామని మంత్రి హెచ్చరించారు.