
ఎల్లారెడ్డి, వెలుగు : ఎల్లారెడ్డిలో ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటుపై సీఎం రేవంత్రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాష్ర్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో రూ.4.50 కోట్లతో నిర్మించిన బస్స్టాండ్ను మంత్రి ప్రారంభించారు. మీసాన్పల్లి రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్న అనంతరం మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టేట్లో 2 డిపోలను ఏర్పాటు చేసిందన్నారు.
ఎల్లారెడ్డిలో డిపో ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడు అడుగుతుంటారన్నారు. ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలకు అనుసంధానంగా బస్సులు ప్రారంభిస్తామన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం తీసుకొస్తున్నామన్నారు. గతంలో పెట్టుబడి సాయం 3 నెలల వరకు వచ్చేదని, మేము 9 రోజుల్లోనే రూ. 9వేల కోట్లు ఇచ్చామన్నారు. దేశంలో సన్నబియ్యం ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వమేనని, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె.మదన్మోహన్రావు మాట్లాడుతూ ఎల్లారెడ్డిలో బస్ డిపో ఏర్పాటు ఇక్కడి ప్రజల 40 ఏండ్ల ఆకాంక్ష అన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, రవాణా శాఖ మంత్రితో చర్చించి నిధులు తీసుకొచ్చి బస్టాండు కంప్లీట్ చేయించానన్నారు. మహిళా సంఘాలకు రుణ సాయం చెక్ను మంత్రి అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్చంద్ర, ఆర్డీవో వీణ, లైబ్రరీ జిల్లా చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్రావు పాల్గొన్నారు.