
కరీంనగర్ సిటీ, వెలుగు: పర్యావరణాన్ని కాపాడుకుంటేనే ఆరోగ్యంగా ఉంటామని, రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ‘స్వచ్ఛతా హీ సేవా’లో భాగంగా కరీంనగర్ ఎల్ఎండీ సమీపంలో ‘ఏక్ దిన్–ఏక్ గంట– ఏక్ సాత్’ నినాదంతో శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చీపురు పట్టి మానేరు డ్యామ్ పరిసరాలు శుభ్రం చేశారు.
విద్యార్థులతో కలిసి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని, అప్పుడే విజయవంతమవుతాయన్నారు. దేశ రాజధాని కాలుష్యంతో నిండిపోయిందని, అలాంటి పరిస్థితి తెలంగాణలో రాకుండా పెద్దసంఖ్యలో మొక్కలు పెంచాలన్నారు.
శాతవాహనలో రెండు హాస్టళ్లకు శంకుస్థాపన
శాతవాహన యూనివర్సిటీలో రూ.20 కోట్లతో చేపట్టిన ఎస్టీ బాయ్స్, గర్ల్స్ హాస్టళ్ల నిర్మాణానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాతవాహన వర్సిటీ పరిధిలో హుస్నాబాద్లో ఇంజినీరింగ్ కాలేజీ, కరీంనగర్లోఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, ఫార్మసీ కోర్సులు తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ పమేలా సత్పతి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు, వీసీ ఉమేశ్కుమార్, బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ తదితరులు పాల్గొన్నారు.