13న లష్కర్ బోనాలు వైభవంగా నిర్వహించాలె : మంత్రి పొన్నం ప్రభాకర్

13న లష్కర్ బోనాలు వైభవంగా నిర్వహించాలె : మంత్రి  పొన్నం ప్రభాకర్
  • 14 న రంగం..జిల్లా ఇన్​చార్జి మంత్రి పొన్నం 
  • బోనాల ఉత్సవాలపై సమీక్ష 

హైదరాబాద్ సిటీ,/ పద్మారావునగర్, వెలుగు:  జూలై 13 జరగనున్న సికింద్రాబాద్ (లష్కర్) ఉజ్జయినీ మహంకాళీ బోనాలు ఘనంగా నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ జిల్లా ఇన్​చార్జి మంత్రి  పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సనత్​నగర్​ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ వెంకట్రావు, కలెక్టర్ హరిచందన, అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి లష్కర్​మహంకాళీ టెంపుల్​లో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

మంత్రి మాట్లాడుతూ జూలై 13న లష్కర్​బోనాలు, 14న రంగం ( భవిష్యవాణి) తర్వాత అమ్మవారిని అంబారీపై ఊరేగించడం ఉంటుందన్నారు. రెండు రోజుల్లో లక్షల్లో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. ఊరేగింపులో తొక్కిసలాటలు జరగకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. లష్కర్​తో పాటు గోల్కొండ, బల్కంపేట ఎల్లమ్మ, లాల్ దర్వాజా బోనాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. డిప్యూటీ మేయర్ శ్రీలత,  ఆలయ కమిటీ చైర్మన్ కామేశ్వర్ 
పాల్గొన్నారు.