- రంగారెడ్డి జడ్పీ మీటింగ్లో మంత్రి సబితను నిలదీసిన సభ్యులు
- జిల్లాలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నయంటూ ఆగ్రహం
రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: జిల్లాలోని ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు లేరని.. స్టూడెంట్లు ఎలా చదువుకుంటారని రంగారెడ్డి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు మంత్రి సబితను నిలదీశారు. జిల్లాలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్డీకపూల్లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశానికి జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి అధ్యక్షత వహించగా విద్యా శాఖ మంత్రి సబితా రెడ్డి చీఫ్గెస్ట్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎజెండాలోని పలు అంశాలపై సభ్యులు చర్చించారు. జిల్లాలోని మంచాల, తలకొండపల్లి, ఇతర మండలాల్లోని స్కూళ్లలో టీచర్ల కొరత తీవ్రంగా ఉందని, ఫలితాలు రావడం లేదని వాపోయారు.
టీచర్లు లేకపోతే స్టూడెంట్లు ఎలా చదువుతారని డీఈవో సుశీందర్రావును ప్రశ్నించారు. తలకొండపల్లి, యాచారం మండలాల్లోని ఆసుపత్రుల పెచ్చులు ఊడిపోతున్నాయని, కొన్ని ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత ఉందన్నారు. వీటితోపాటు జిల్లాలోని పలు సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు. కాగా ఈ సమస్యలను ఆయా శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలని మంత్రి సబిత ఆదేశించారు. సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ప్రజా పరిషత్ సీఈవో దిలీప్ కుమార్, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, కో-ఆప్షన్ సభ్యులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.