జైలుకెళ్లాలని కేటీఆర్ తహతహలాడుతున్నరు : మంత్రి సీతక్క

జైలుకెళ్లాలని కేటీఆర్ తహతహలాడుతున్నరు : మంత్రి సీతక్క
  • పొగరుగా మాట్లాడుతూ రేవంత్​ను రెచ్చగొడుతున్నరు: మంత్రి సీతక్క
  • కవిత జైలుకు పోయివచ్చినంక బీసీ ఎజెండా ఎత్తుకున్నది 
  • తోడేళ్లలా  దోచుకుని కొంగ వినయం ప్రదర్శిస్తున్నారని ఫైర్​

హైదరాబాద్, వెలుగు:  జైలుకు పోవాలని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్  తహతహలాడుతున్నారని మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు.  అందుకే సీఎం రేవంత్​ను కేటీఆర్​ రెచ్చగొడుతున్నారని  అన్నారు. సోమవారం హైదరాబాద్​లోని పోలీస్ కమాండ్  కంట్రోల్ సెంటర్ వద్ద మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్ లో కేటీఆర్, కవిత మధ్య పోటీ నెలకొన్నది. కవిత జైలుకు పోయివచ్చి బీసీ ఎజెండా ఎత్తుకున్నారు. ఈ విషయంలో తాను వెనకబడ్డానని కేటీఆర్ కూడా జైలుకు పోయేందుకు పథకం రచిస్తున్నారు’’ అని వ్యాఖ్యానించారు. 

సీఎం రేవంత్​ పౌరుషంతో మాట్లాడుతుంటే.. కేటీఆర్ పొగరుగా మాట్లాడుతున్నారని ఫైర్​ అయ్యారు. ఫార్ములా ఈ రేస్​వ్యవహారాన్ని దర్యాప్తు సంస్థలే చూసుకుంటాయని, తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.  కానీ కేటీఆర్​ ఏదో ఆశించి జైలుకు పోవాలనుకుంటున్నారని అన్నారు. తోడేళ్లలా దొచుకుని, ఇప్పుడు కొంగ వినయం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.  

పంచాయతీ ఎన్నికలపై త్వరలో స్పష్టత

 స్థానిక సంస్థల ఎన్నికలకు వారం రోజుల్లో నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ వస్తుందని తాను చెప్పలేదని, వారంలోగా స్పష్టత వస్తుందని మాత్రమే చెప్పానని మంత్రి సీతక్క తెలిపారు. కేబినెట్‌‌‌‌‌‌‌‌లో నిర్ణయం తీసుకోకుండా ఎలా చెబుతానని అన్నారు. ‘‘నేను ఎన్నికల డేట్ చెప్పినట్లుగా మీడియా లో ప్రచారం జరిగింది. అది అవాస్తవం. మీడియా సంస్థలు వాస్తవాలు తెలుసుకొని వార్తలు వేయాలి. నేను అనని మాటలు అన్నట్లుగా వార్తలు ఇవ్వడం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది.  నేను వారం రోజుల్లో షెడ్యూల్ వస్తుందని చెప్పినట్లుగా ఆధారాలు చూపిస్తారా?” అని ప్రశ్నించారు.  

20 ఏండ్లుగా ప్రజా సేవలో ఉన్నానని, లోకల్ ఎన్నికలు ఎలా జరుగుతాయో తనకు తెలియదా? అని అన్నారు.   బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా సామాజిక న్యాయం సాకారం అవుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన బిల్లును సైతం అసెంబ్లీలో పాస్ చేశామని,  స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకే ఎన్నికల్లో జాప్యం జరుగుతున్నదని తెలిపారు. 

కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్ల అంశం కేంద్రం చేతిలో ఉందని, అలాంటప్పుడు 42శాతం రిజర్వేషన్లు ఎలా కల్పించాలన్న దానిపై చర్చిస్తామన్నారు. పదేండ్లు అధికారంలో ఉండి అట్టడుగు వర్గాలను అణగదొక్కిన బీఆర్ఎస్​.. ఇప్పుడు బీసీలకు 42 శాతం అని కూనిరాగాలు తీస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని చెప్పారు.