మిల్లెట్స్ హబ్‌గా హైదరాబాద్

మిల్లెట్స్ హబ్‌గా హైదరాబాద్
  • గ్లోబల్ మిల్లెట్స్ సెంటర్‌ శంకుస్థాపనలో కేంద్రమంత్రి శివరాజ్​సింగ్ చౌహాన్
  • ​మిల్లెట్స్​ పరిశోధన, అభివృద్ధి, ప్రాచుర్యమే ప్రధాన లక్ష్యమని వెల్లడి
  • హాజరైన రాష్ట్ర మంత్రి తుమ్మల..ఆయిల్ పామ్ మద్దతు ధర పెంచాలని రిక్వెస్ట్

హైదరాబాద్/గండిపేట్, వెలుగు: మిల్లెట్స్ పరిశోధన, అభివృద్ధి, ప్రాచుర్యమే ప్రధాన లక్ష్యంగా హైదరాబాద్​లో గ్లోబల్ మిల్లెట్స్ సెంటర్‌ ఏర్పాట్లుకు శ్రీకారం చుట్టామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అన్నారు.  సోమవారం ఆయన హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్ ఆధ్వర్యంలో ఇండియన్​ ఇన్‌స్టిట్యూట్​ఆఫ్​ మిల్లెట్​రిసెర్చ్​ (ఐఐఎంఆర్) ప్రాంగణంలో ‘గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్’కు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా చౌహాన్​ మాట్లాడుతూ.. హైదరాబాద్ మిల్లెట్స్ హబ్‌గా మారుతున్నదన్నారు. ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్ల ప్రాముఖ్యతను పెంచేందుకు  గ్లోబల్ మిల్లెట్స్ సెంటర్‌ మార్గదర్శకంగా పనిచేస్తుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్‌ చౌదరి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రులతో మంత్రి తుమ్మల భేటీ

హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రులు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, భగీరథ్‌ చౌదరిలతో  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు అవసరమైన పలు అభ్యర్థనలతో కూడిన వినతిపత్రాన్ని వారికి అందజేశారు. తెలంగాణలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల తన లేఖలో కోరారు. రాష్ట్రంలో 3,300 ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోందని తుమ్మల తెలిపారు.

రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ నుంచి విజయవాడకు కొబ్బరి బోర్డు కార్యాలయం తరలిపోవడంతో రైతులు సకాలంలో సేవలు పొందలేకపోతున్నారని చెప్పారు. ఆశ్వారావుపేట లేదా దమ్మపేటలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు.అలాగే.. ఆయిల్‌పామ్‌ గెలలకు కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.25 వేలు నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్  ఆయిల్ పామ్’’ కింద తెలంగాణ 1.25 లక్షల హెక్టార్ల లక్ష్యంతో 75,000 హెక్టార్లలో సాగు చేసి దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.

నాణ్యమైన విత్తనాల కొరతతో కంపెనీలు 5-6 సరఫరాదారులపై ఆధారపడుతున్నాయని, ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన విత్తన సరఫరాదారులను ఎంప్యానెల్ చేయాలని అభ్యర్థించారు. అంతేగాక, ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం.. హార్టికల్చర్ యూనివర్సిటీకి రూ.1,823.20 కోట్ల బడ్జెట్‌లో ఇప్పటివరకు రూ.135 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని తుమ్మల తెలిపారు. విద్య, పరిశోధన, విస్తరణ సేవల కోసం రూ.100 కోట్లు మంజూరు చేయాలన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి కేంద్ర సహకారం తప్పనిసరని పేర్కొన్నారు. కాగా.. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, మైనర్ ఇరిగేషన్ కోసం కేంద్ర నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కోరారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి రెండు కీలక ప్రతిపాదనలతో ఆయన లేఖ సమర్పించారు.