ఫోన్​ ట్యాపింగ్​పై చట్టం ప్రకారమే చర్యలు : మంత్రి శ్రీధర్​ బాబు

ఫోన్​ ట్యాపింగ్​పై చట్టం ప్రకారమే చర్యలు : మంత్రి శ్రీధర్​ బాబు
  • బీఆర్​ఎస్​ లెక్క మేం ప్రొసీజర్​లో ఇన్వాల్వ్​ కాం..కేసులో ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదు: మంత్రి శ్రీధర్​ బాబు 
  •     ఎవరు ఎవరి తాట తీస్తరో ఎన్నికల తర్వాత తెలుస్తది
  •     పాలన మొదలై మూడు నెలలుకాగానే మాపై పడుతున్నరు
  •     మేం అందరి సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం
  •     ఉమ్మడి ఏపీలో కన్నా దారుణంగా ఫోన్లు ట్యాప్​ చేశారు: పొన్నం 
  •     తుక్కుగూడ సభ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం, మంత్రులు

హైదరాబాద్, వెలుగు: ఫోన్​ ట్యాపింగ్​పై చట్టం, న్యాయానికి తగినట్టే చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్​బాబు స్పష్టం చేశారు.  పద్ధతి ప్రకారం విచారణ జరుగుతుందని, ఆ ప్రొసీజర్​లో వారిలాగా(గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంలాగా) తాము ఇన్వాల్వ్​ కాబోమని చెప్పారు. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్​ నేతృత్వంలోనే పాలన జరుగుతున్నదని, ఎన్నికల కోడ్​కు తగ్గట్టుగానే తాము మాట్లాడాల్సి ఉంటుందని పేర్కొన్నారు.  

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎవరి తాట తీశారో అందరికీ తెలుసని, పార్లమెంట్​ఎన్నికల తర్వాత ఎవరు ఎవరి తాట తీస్తారో కూడా తెలుస్తుందని ఆయన కేటీఆర్​ కామెంట్లకు కౌంటర్​ ఇచ్చారు. తుక్కుగూడలో శనివారం నిర్వహించనున్న కాంగ్రెస్​ జనజాతర సభ ఏర్పాట్లను సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రులు శ్రీధర్​ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేశ్​ కుమార్​ గౌడ్​, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి తదితరులు గురువారం పరిశీలించారు. 

సభ ఏర్పాట్లపై అక్కడే  సీఎం రేవంత్​ రివ్యూ చేశారు. అనంతరం మంత్రులు శ్రీధర్​ బాబు, పొన్నం ప్రభాకర్​ మీడియాతో మాట్లాడారు. ఈ సభ నుంచే కాంగ్రెస్​ జాతీయ మేనిఫెస్టోను ప్రకటించనున్నట్టు శ్రీధర్​బాబు చెప్పారు. సభకు రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి నేతలు హాజరవుతున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు సోనియా గాంధీ ఇక్కడ ఆరు గ్యారంటీలను ప్రకటించారని, ఇప్పుడు ఇదే తుక్కుగూడ నుంచి జాతీయ స్థాయి మేనిఫెస్టో రిలీజ్​ కార్యక్రమం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జనజాతర సభపై 17 లోక్​సభ సెగ్మెంట్ల ఇన్​చార్జు, ఇప్పటికే ప్రకటించిన 14 సెగ్మెంట్ల అభ్యర్థులతో సీఎం రేవంత్​ రెడ్డి సమీక్ష చేశారని తెలిపారు. లోక్​సభ నియోజకవర్గాల ఇన్​చార్జులు, పోటీలో ఉన్న అభ్యర్థులంతా గ్రామస్థాయి, మండల స్థాయి నుంచి జనాల్ని సభకు తీసుకురావాలని ఆయన సూచించారు. 

వాళ్లకు ఓపిక లేదు

కాంగ్రెస్​ పాలన మొదలై మూడు నెలలే అయిందని.. రైతన్నలు, నేతన్నలు, విద్యార్థులు సహా అన్ని వర్గాలకూ సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని, దీనిని భవిష్యత్​లోనూ కొనసాగిస్తామని మంత్రి శ్రీధర్​ బాబు చెప్పారు. అధికారాన్ని కోల్పోయామన్న ఆలోచనలోనే బీఆర్​ఎస్​ నేతలు ఉన్నారని, ప్రస్తుత ప్రభుత్వ పాలనను చూద్దామన్న ఓపిక కూడా వారికి లేకుండా పోయిందని విమర్శించారు. గత బీఆర్​ఎస్​ పాలనలో చేనేత కార్మికులకు రూ.400 కోట్ల బకాయిలు పెట్టారని, పదేండ్లపాటు వారి సంక్షేమాన్ని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. వారికి ఇన్నేండ్లూ పేమెంట్లు ఎందుకు చేయలేదని నిలదీశారు. కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డ్​( కేఆర్​ఎంబీ) మీటింగ్​కు సంబంధించిన విషయంపై ఇప్పటికే ఇరిగేషన్​ శాఖ మంత్రి వివరాలు తీసుకున్నారని, దానిపై ఆయనే చెప్తారని మంత్రి శ్రీధర్​బాబు అన్నారు. 

ఫోన్​ ట్యాపింగ్​ను సమర్థించుకునుడేంది?​: పొన్నం ప్రభాకర్​

ఉమ్మడి ఏపీలో కన్నా దారుణంగా రాష్ట్రం వచ్చాక బీఆర్​ఎస్​ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో ఫోన్​ ట్యాపింగ్​కు పాల్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్​ మండిపడ్డారు. ప్రతిపక్షాలు, సొంత పార్టీలోని నేతలను కూడా అణచివేసేందుకు, ఉద్యమాలను తొక్కి పెట్టేందుకు అత్యంత నీచంగా ఫోన్​ ట్యాపింగ్​కు పాల్పడ్డారని అన్నారు. ‘‘ఉమ్మడి ఏపీలో నాటి సీఎం కిరణ్​కుమార్​రెడ్డి ఫోన్లను ట్యాప్​ చేశారన్నాం.. అది నిజమే. 

కానీ, ఉద్యమకారుడిగా రాష్ట్రం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్​ఎస్​ పార్టీ దానిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటే బాగుండేది. అట్ల చేశారా? అంతకన్నా ఎక్కువగా ట్యాపింగ్​కు పాల్పడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను అణచివేసేందుకు వాడుకున్నారు. పైగా దాన్ని సమర్థించుకుంటున్నారు. ఒకరిద్దరు లంగలపై ఫోన్​ ట్యాప్​ చేస్తే తప్పేందన్నట్టు మాట్లాడుతున్నారు. ఫోన్​ ట్యాపింగ్​తో ప్రజల ప్రైవసీ హక్కులు, రాజ్యాంగ హక్కులను కాలరాయడం నిజం కాదా? ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఇలాంటి చర్యలకు ఎందుకు పాల్పడ్డారో చెప్పాలి. ఒకరిద్దరు లంగల ఫోన్లను ట్యాప్​ చేశారని చెప్పిన ఆయన(కేటీఆర్​).. తనకు సంబంధం లేదని ఎట్ల అంటరు?’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్​ నిలదీశారు. తప్పులను అధికారులపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.