కాంగ్రెస్తోనే పల్లెల అభివృద్ధి
పేద ప్రజల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం మంత్రి సీతక్క
హైదరాబాద్: బీజేపీ పాలనలో దేశం అథోగతి పాలైందని మంత్రి సీతక్క అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖానాపూర్ నియోజకవర్గంలోని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లోని రాంపూర్, తిమ్మాపూర్, సింగరాయిపేట, తపాల్పూర్ గ్రామాలలో ఇవాళ ఉదయం ఇంటింటా తిరుగుతూ ఆమె ప్రచారం నిర్వహించారు.
రాంపూర్ లో చెరువు వద్ద ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కూలీల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంలో నిత్యావసర సరుకులతో పాటు అన్ని రకాల వస్తువులపై ధరలు పెరిగాయన్నారు. రాముని పేరుతో దేశాన్ని విభజించి బీజేపీ ఓట్లు అడుగుతుందన్నారు. బీఆర్ఎస్ పాలనలో అన్నింటా అవినీతి జరిగిందని ఆరోపించారు.
పేద ప్రజల అభ్యున్నతే కాంగ్రెస్ ధ్యేయమన్నారు. పల్లెల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమైందన్నారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వంమేనని చెప్పారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగుణ చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపిస్తే రాహుల్ గాంధీని ప్రధాని చేసినట్లేనని ఆమె అన్నారు. కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్, మండల కాంగ్రెస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.