రేవంత్ రెడ్డికి మతిపోయింది ఊరూరా కాంగ్రెస్​ను నిలదీయాలి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

రేవంత్ రెడ్డికి మతిపోయింది ఊరూరా కాంగ్రెస్​ను నిలదీయాలి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్, వెలుగు: రైతులకు కేవలం మూడు గంటల పాటు ఉచిత విద్యుత్ సరిపోతుందంటూ అహంకారంగా మాట్లాడిన రేవంత్ రెడ్డికి మతిపోయిందని మంత్రి ఇంద్రకరణ్ ​రెడ్డి అన్నారు. బుధవారం సోన్ మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఏనాడూ అరక పట్టి దున్నింది లేదని, ఆయనకు రైతుల కష్టాలు తెలియని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో రైతులంతా ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలకు పాల్పడ్డారని, తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో వారంతా ఆనందంగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రైతుల ఆత్మహత్యలు, వలసలు లేవన్నారు. 

స్వరాష్ట్రంలో వ్యవసాయం లాభసాటిగా మారిందని తెలిపారు. కాంగ్రెస్​ను ఊరూరా నిలదీయాలన్నారు. రైతులు సంతోషంగా జీవిస్తుంటే కాంగ్రెస్ పార్టీకి కడుపు మంటగా ఉందని, ఆ పార్టీని రాష్ట్రంలోనుంచి తరిమికొట్టాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్ వెంకటరామిరెడ్డి, జడ్పీటీసీ జీవన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, సర్పంచ్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.