
-
ఏఐ ఆధారిత మెంటల్ హెల్త్ సపోర్ట్సిస్టం ‘హోప్ఐ’ని ఆవిష్కరించిన శ్రీధర్ బాబు
హైదరాబాద్, వెలుగు: సమాజంలో వేగంగా పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళన తదితర మానసిక సమస్యలకు పరిష్కారం చూపించగల సామర్థ్యం టెక్నాలజీకి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ‘సైబర్ హోప్ హెల్ప్ ఇనిషియేటివ్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో రూపొందించిన ఏఐ ఆధారిత మెంటల్ హెల్త్ సపోర్ట్ సిస్టం ‘హోప్ ఐ’ను ఆయన బుధవారం రాయదుర్గంలోని టీ హబ్లో ఆవిష్కరించారు.
ఇన్నొవేషన్ హబ్ గా తెలంగాణను తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. ప్రజల ప్రాణాలను కాపాడే ఆవిష్కరణలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు. ఆ దిశగా దృష్టి సారించి ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను కనుక్కోవాలని యువ ఆవిష్కర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీ హబ్ సీఈవో కవికృత్, సైబర్ హోప్ హెల్ప్ ఇనిషియేటివ్ ఫౌండేషన్ చైర్మన్ ఇన్నారెడ్డి పాల్గొన్నారు.