
తెలంగాణలో యువతకు ఉపాధి కల్పించేలా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రేవంత్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న "ఫ్యూచర్ సిటీ"లో వేయి ఎకరాల్లో ప్రత్యేకంగా "ఎలెక్ట్రానిక్ సిటీ(ఈ సిటీ)ని అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
300 కోట్ల రూపాయిలను పెట్టుబడి పెట్టేందుకు అంగీకారం తెలిపిన టెలికాం ఉత్పత్తుల సంస్థలు సిరా నెట్ వర్క్స్(తైవాన్), ఎల్ సీజీసీ రెజల్యూట్ గ్రూప్(తెలంగాణ) ప్రతినిధులతో శనివారం ( మే 3) సచివాలయంలో సమావేశమయ్యారు. ఎలక్ట్రానిక్ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. పరిశ్రమల ఏర్పాటులో పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు.
ఈసిటీలో నెలకొల్పే పరిశ్రమ ద్వారా 2500 మంది యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇక్కడ 5జీ నెట్ వర్క్స్ , మల్టీ లేయర్ నెట్వర్కింగ్ సొల్యూషన్స్, సర్వర్స్ తదితర టెలికాం ఉత్పత్తులను తయారు చేస్తారన్నారు. ఈ పెట్టుబడితో ఇండో తైవాన్ మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.టైర్ -2, టైర్ -3 నగరాలు, పట్టణాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలిచ్చి వారి అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా ఉంటుందని హామీ ఇచ్చారు.
తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యయ్యేందుకు ముందుకొచ్చిన సిరా నెట్ వర్క్స్, ఎల్ సీజీసీ రెజల్యూట్ గ్రూప్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు టీజీఐసీసీ సీఈవో మధుసూదన్, టీ ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్, సిరా నెట్ వర్క్స్ ప్రతినిధులు చుయాన్, జాయ్ భట్టాచార్య, డౌగియాస్, ఎల్ సీజీసీ రెజల్యూట్ గ్రూప్ నుంచి రణ్విందర్ సింగ్, గీతాంజలి సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు.