ఎక్కడా సపోర్టు చేస్తలేం
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎలక్షన్లలో ఎంఐఎం పార్టీతో టీఆర్ఎస్ పార్టీ పొత్తుపెట్టుకోలేదని, ఇరు పార్టీల మధ్య స్నేహం మాత్రం ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. తాండూరు మున్సిపల్ చైర్మన్ పదవిని ఎంఐఎంకు ఇస్తున్నట్టు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్ లో తలసాని మీడియాతో మాట్లాడారు. మజ్లిస్ పార్టీ కేవలం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితమని, ఆ పార్టీకి ఒక్క కార్పొరేషన్, మున్సిపాలిటీ కూడా ఇవ్వబోమని చెప్పారు. తమకు మేయర్, చైర్మన్ పదవులను దక్కించుకోడానికి ఏ పార్టీ సహకారం అవసరం లేదన్నారు. ఎంఐఎం పోటీ చేస్తున్న చోట బీజేపీ ఎందుకు పోటీ చేయడం లేదని, ఇద్దరి మధ్య ఏదైనా ఫిక్సింగ్ ఉందా అని ప్రశ్నించారు. ఆరేండ్లలో కేంద్రం రాష్ట్రానికి ఏమీ చేయలేదన్నారు.