అభివృద్ధి చేయడానికి సీనియర్ ఏంటీ? జూనియర్ ఏంటీ? 

అభివృద్ధి చేయడానికి సీనియర్ ఏంటీ? జూనియర్ ఏంటీ? 

అభివృద్ధి చేయడానికి సీనియర్ ఏంటీ.. జూనియర్ ఏంటీ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. జానారెడ్డి ఓటమి భయంతోనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు. సాగర్ ఉపఎన్నిక సందర్భంగా మంత్రి తలసాని, ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్‌తోనే సాధ్యమని ఆయన అన్నారు.‘జానారెడ్డి వయసులో చాలా పెద్దాయన. ఆయన పెద్దరికంగా మాట్లాడాలి. 35 ఏళ్లపాటు సాగర్‌లో ఏం అభివృద్ధి చేశారో అందరికి తెలుసు. వాళ్ళ నోటికి మొక్కుతున్నా.. వాళ్ళ అబద్దాల మాటలు వారికే తెలియాలి. కొన్ని మండలాల్లోని గ్రామాల్లో సాగునీరు లేక పంటలు ఎండుతున్నాయి. సాగర్‌ను అభివృద్ధి చేయడానికి సీనియర్ ఏంటీ? జూనియర్ ఏంటీ? విద్యావంతుడు భగత్ బాగా పనిచేస్తాడు. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు రాబోతున్నాయి. కాంగ్రెస్ హయాంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? సాగర్‌లో ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ నాయకులకు ఎంత మందికి కరోనా వచ్చిందో నాకు తెలియదు. కానీ, ప్రచారంలో పాల్గొన్న వారికి కరోనా సోకే అవకాశమైతే ఉంది’ అని ఆయన అన్నారు.