ఖమ్మం టౌన్, ములకలపల్లి, వెలుగు : నగంలో రోడ్లను ఎవరూ ఆక్రమించొద్దని, పేదలకు ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలోని 54వ డివిజన్ లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్క్ ను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్రంలో నివాసయోగ్య నగరంగా ఖమ్మం ముందు వరుసలో ఉందన్నారు. ప్రజల సౌకర్యార్థం కోసం ఏర్పాటు చేసిన పార్క్ లో సీసీ కెమెరాలు, గ్రాస్ కార్పెట్ తదితరాల వసతులు సమకూర్చుకోవాలని సూచించారు. నీటి ప్రవాహానికి అడ్డంకులు పెట్టడంతో సమస్యలు వస్తున్నాయని, అధికారుల ప్లాన్ ప్రకారం పనిచేయాలని చెప్పారు. కొంతమందికి ఇబ్బంది కల్గినా చాలా మందికి లబ్ధిచేకూరుతుందన్నారు.
నష్టపోయిన ప్రతిఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. శాంతి భద్రతలు, పచ్చదనం, పరిశుభ్రత పాటిస్తే మరింత అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాజమండ్రికి గంటన్నర, హైదరాబాద్ కు రెండున్నర గంటల్లో వెళ్లొచ్చని చెప్పారు. ప్రజలు రోడ్ల వెడల్పునకు సహకరించాలని కోరారు. రోడ్ల వెడల్పుతో వ్యాపారం అభివృద్ధితోపాటు నగరం అందంగా మారుతుందని వివరించారు. నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ఖమ్మం నగర జనాభా 5 లక్షలకు చేరిందని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీటి సరఫరా, నూతన డ్రైనేజీ, రోడ్డు విస్తీర్ణం, పేదలకు ఇండ్లు వంటి అనేక కార్యక్రమాలు చేపటనున్నట్లు వివరించారు. అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మంత్రి బోగి మంటలను వెలిగించి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
మాదారం గ్రామ సర్పంచ్ గంప సుజాత ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు మంత్రి తుమ్మలను కలిసి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు, స్థానిక కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల, కార్పొరేటర్లు, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
