- యూరియాపై అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష
హైదరాబాద్, వెలుగు: యాసంగికి అవసరమైన యూరియా, ఎరువులు సిద్ధంగా ఉన్నాయని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం మంత్రి అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్రావు, డైరెక్టర్తో యూరియాపై సమీక్ష నిర్వహించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ యాసంగి సీజన్ కోసం వ్యవసాయశాఖ 19.24 లక్షల టన్నుల ఎరువుల ప్రణాళికను రెడీ చేసినట్లు చెప్పారు.
మార్క్ఫెడ్, ఎరువుల కంపెనీలతో సమావేశం నిర్వహించి నెలలో కేటాయించిన ఎరువులు, రాష్ట్రంలో ప్రాంతాల వారీగా వేసిన పంటల ప్రణాళికలకు అనుగుణంగా సరఫరాకు సిద్ధం చేయాలన్నారు. సోమవారం నాటికే 7.01లక్షల టన్నుల ఎరువులు ఉన్నాయని, ఈ సీజన్కు 9 లక్షల టన్నుల ఎరువులు బఫర్ స్టాక్ సిద్ధం చేసినట్లు చెప్పారు. నిరుడు కంటే ఈసారి 28శాతం అధికంగా ఎరువులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. నిరుడు ఈ టైమ్లో యూరియా 3.57లక్షల టన్నుల నిల్వలు ఉంటే, ఇప్పుడు 4.68లక్షల టన్నుల నిల్వలు ఉన్నట్లు చెప్పారు. మొత్తం 9 లక్షల 185 టన్నులు ఎరువుల ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు.