
- అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రైతులకు పచ్చిరొట్ట విత్తనాల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఇటీవల పలు ఫిర్యాదులు అందడంతో మంత్రి స్పందించారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, విత్తనాల సరఫరాలో ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తామని తుమ్మల హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పచ్చిరొట్ట విత్తనాల సరఫరా కోసం తెలంగాణ సీడ్స్ కార్పోరేషన్ కు 90 వేల క్వింటాళ్లు, నేషనల్ సీడ్ కార్పోరేషన్(ఎన్ఎస్సీ) కు 40 వేల క్వింటాళ్ల ఇండెంట్ను కేటాయించింది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో 20 జిల్లాలను టీజీ సీడ్స్కు, 12 జిల్లాలను ఎన్ఎస్సీకి కేటాయించగా, టీజీ సీడ్స్ ఇప్పటివరకు 71,535 క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేసింది.
కేటాయించిన 20 జిల్లాల్లో పంపిణీని ప్రారంభించింది. అయితే, ఎన్ఎస్సీ మాత్రం కేటాయించిన 40 వేల క్వింటాళ్లలో కేవలం వెయ్యి క్వింటాళ్లు మాత్రమే సరఫరా చేయడంతో ఆ సంస్థకు కేటాయించిన 12 జిల్లాలు విత్తనాల సరఫరాలో అడ్డంకులు ఎదుర్కొన్నాయి. మంత్రి ఆదేశాలతో అప్రమత్తమైన అధికారులు.. టీజీ సీడ్స్ ద్వారా మొదట కేటాయించిన జిల్లాలతో పాటు ఎన్ఎస్సీకి సంబంధించిన జిల్లాల్లో కూడా విత్తనాల సరఫరాను ప్రారంభించారు. టీజీ సీడ్స్ ద్వారా మరిన్ని విత్తనాలను తెప్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.