హైదరాబాద్, వెలుగు: కేంద్ర మంత్రి బండి సంజయ్కి దమ్ముంటే ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై సంజయ్ చేసిన విమర్శలకు తుమ్మల ఘాటుగా సమాధానం ఇచ్చారు. సంజయ్ రాసిన బహిరంగ లేఖకు ప్రతిగా తుమ్మల బహిరంగ లేఖ రాస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు.
‘‘రైతుల నుంచి కొనే ప్రతి గింజకు మోదీ సర్కారు డబ్బులిస్తోందని అంటున్న సంజయ్.. ముందు కేంద్రం ఏఏ పంటలు కొంటున్నది, ఎంత శాతం కొంటోంది, ఎన్ని డబ్బులు ఇస్తోందనే విషయాలు కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహన్ను అడిగి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది.
కేంద్ర మంత్రిగా ఉన్న నువ్వు (సంజయ్) రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో పోరాడాలి. అన్ని పంటలను కేంద్రం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి గింజను మద్దతు ధరకు కొనేలా కేంద్రాన్ని ఒప్పించాలి. ఎంఎస్పీకి చట్టబద్దత కల్పించాలని రాష్ట్రాన్ని అడుగుతున్నరు. అది రాష్ట్రం పరిధిలోనిది కాదనే విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడడం మీ రాజకీయ విజ్ఞతకే వదిలేస్తున్నా. రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.20,625 కోట్లు రుణమాఫీ చేశాం” అని తుమ్మల పేర్కొన్నారు.
