మంత్రి ఉత్తమ్ కు హైకమాండ్ పిలుపు.. మంత్రి వర్గం శాఖలపై చర్చ

మంత్రి ఉత్తమ్ కు హైకమాండ్ పిలుపు.. మంత్రి వర్గం శాఖలపై చర్చ

తెలంగాణ రాజకీయాలపై ఢిల్లీలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఇప్పటికే రెండు రోజులుగా  సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఇపుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది.  జూన్ 10న సాయంత్రం 5 గంటలకు  ఉత్తమ్ ఢిల్లీకి  వెళ్లనున్నారు. 

 అసలేం జరుగుతోంది.

 సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర క్యాబినెట్ లో కీలక మార్పులుంటాయని తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్ పలువురి మంత్రుల శాఖలను తొలగించే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే  జూన్ 8న ప్రమాణం స్వీకారం చేసిన మంత్రి వివేక్  వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ ,వాకిటి శ్రీహరిలకు శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్,ఉత్తమ్ తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎవరిక ఏ శాఖ ఇస్తే బాగుంటుంది..ఇపుడున్న మంత్రుల పనితీరు ఎలా ఉంది..శాఖలు మార్చుదామా వద్దా.? అనేది సీఎం, మంత్రి ఉత్తమ్ తో  చర్చించనున్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ,రాహుల్ గాంధీ.  అలాగే  కేబినెట్ లో ఖాళీగా ఉన్న మరో మూడు మంత్రి పదవులు భర్తీపై కూడా చర్చించనున్నారు. 

మంత్రివర్గంలో చోటు వస్తుందని ఆశించిన పలువురు సీనియర్లు అలక మీద ఉన్నారు. వీరిని రాష్ట్ర కాంగ్రెస్ ఇప్పటికే బుజ్జగించింది. ఈ విషయం కూడా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు సీఎం. సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ ఢిల్లీ వెళ్లడంతో ఢిల్లీలో ఏం జరుగుతోంది..ఎవరి మంత్రి పదవి ఊడుతుంది..ఎవరి శాఖలు మారుతాయని జోరుగా చర్చించుకుంటున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.