
పాలమూరు, వెలుగు : కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవినీతిని బయట పెట్టేందుకే సీబీఐకి అప్పగించినట్ల మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. మహబూబ్నగర్ జిల్లా పార్టీ ఆఫీస్లో గురువారం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీ బంధం గత పార్లమెట్ ఎన్నికల టైంలోనే బయటపడిందని, బీఆర్ఎస్ ఓట్లతోనే డీకే అరుణ ఎంపీగా గెలిచారన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరంపై విజిలెన్స్ కమిషన్తో విచారణ జరిపించామని, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే సీబీఐ విచారణ కోరినట్లు స్పష్టం చేశారు. లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్ట్ పూర్తిగా ప్రమాదంలో పడితే... మూడు పిల్లర్లకు రిపేర్లు చేస్తే సరిపోతుందని బీఆర్ఎస్ లీడర్లు అనడం వారి అవివేకానికి నిదర్శనం అని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను ప్రజలను గమనిస్తున్నారన్నారు.
కాళేశ్వరం విచారణను తమకు అప్పగిస్తే అవినీతి చేసిన వారిని 24 గంటల్లోనే అరెస్ట్ చేస్తామని చెప్పిన కేంద్ర మంత్రులు ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి వల్లే రాష్ట్రంలోని సంక్షేమ పథకాలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్రెడ్డి, మధుసూదన్రెడ్డి, పీసీసీ కార్యదర్శి మిథున్రెడ్డి, నాయకులు ఎంపీ వెంకటేశ్, వినోద్కుమార్, సీజే బెనహర్ పాల్గొన్నారు.