అమరావతి: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనాలోచిత నిర్ణయాల కారణంగా ప్రపంచదేశాలు ఇబ్బందులకు గురవుతున్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం (మే 6) సతీసమేతంగా మంత్రి వివేక్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, రూపీ వాల్యూ తగ్గడం ప్రజలపై భారం పడేలా చేసిందన్నారు. అమెరికా డాలర్తో రూపీ విలువ పడకుండా చూస్తామని ప్రధాని మోడీ చెప్పారని.. కానీ రూపాయి విలువ దారుణంగా పతనమైందని అన్నారు.
మన్మోహన్ సింగ్ హయాంలో క్రూడాయిల్ బ్యారెల్ ధర 125 డాలర్లు ఉన్న కూడా ఆ రోజుల్లో దేశంలో పెట్రోల్ రూ.60కే కాంగ్రెస్ ప్రభుత్వం అందించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రూడాయిల్ బ్యారెల్ ధర 100 డాలర్ల లోపే ఉన్నప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100 దాటేశాయని అన్నారు. ప్రపంచంలోకెల్లా భారత్లోనే పెట్రోల్, డీజిల్పై అధిక పన్నులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.
