పెద్దపల్లి ప్రాంతానికి మా కుటుంబం రుణపడి ఉంది: మంత్రి వివేక్ వెంకటస్వామి

పెద్దపల్లి ప్రాంతానికి మా కుటుంబం రుణపడి ఉంది: మంత్రి వివేక్ వెంకటస్వామి

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్దపెల్లి ప్రాంతానికి మా కుటుంబం రుణపడి ఉందని.. ఈ ప్రాంత ప్రజలు చలువ వల్లే మా తండ్రి కాకా వెంకటస్వామి, తాను, వంశీ పెద్దపల్లి నుంచి ఎంపీలుగా గెలిచామని అన్నారు. మంత్రిగా తనకు వచ్చిన ఈ అవకాశాన్ని పెద్దపల్లి ప్రజల రుణం తీర్చుకునేందుకు వినియోగిస్తానని అన్నారు. సింగరేణి నష్టాల్లోకి వెళ్ళినప్పుడు మా నాన్న చేసిన కృషి వల్లే సంస్థ మళ్ళీ పురోగమిస్తోందని అన్నారు. మంత్రిగా తొలిసారి పెద్దపల్లి గడ్డపై అడుగు పెట్టడం సంతోషంగా ఉందని అన్నారు వివేక్ వెంకటస్వామి. 

సింగరేణి నష్టాల బారిన పడి బీఐ ఎఫ్ఆర్ పరిధిలోకి వెళ్ళినప్పుడు కాకా వెంకటస్వామి 400 కోట్లు ఎన్టీపీసీ ద్వారా ఇప్పించి లక్ష ఉద్యోగాలు కాపాడారని అన్నారు.కార్మికులకు పెన్షన్ పథకము ఇప్పించింది కాకానే అని .. సింగరేణిలో సీఎం పిఎఫ్ ఆఫీసును కూడా కాక పెట్టించారని అన్నారు.  ఉత్తర తెలంగాణలో బిజెపి నాలుగు ఎంపీ సీట్లు గెలిచినప్పటికీ పెద్దపల్లి నుంచి వంశీ కాంగ్రెస్ తరపున గెలిచారంటే పెద్దపెల్లి ప్రజల ప్రేమే కారణమని అన్నారు వివేక్ వెంకటస్వామి. 

అనంతరం పెద్దకల్వల గ్రామంలో పర్యటించిన మంత్రి వివేక్ వెంకట స్వామికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. మంత్రి వివేక్ కు పూలమాలలు వేసి అభినందించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కమాన్ వద్ద శాలువాలు పూలమాలతో ఘన స్వాగతం పలికారు పెద్దపల్లి వాసులు, కాంగ్రెస్ నేతలు, దళిత సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు.