జూబ్లీహిల్స్ బైపోల్ లో కాంగ్రెస్ కు టీజేఎస్ మద్దతివ్వడాన్ని స్వాగతిస్తున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. షేక్ పేట డివిజన్ బూత్ ఇన్ చార్జ్ లతో మంత్రి వివేక్, అజారుద్దీన్ , కొండా సురేఖ, టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వివేక్ వెంకటస్వామి.. తెలంగాణ ఉద్యమంలో కోదండరాం కీలక పాత్ర పోషించారని తెలిపారు. కోదండరాం తెలంగాణ మిలియన్ మార్చ్ లో ముందుండి పోరాటం చేశారన్నారు. నవీన్ యాదవ్ కు టీజేఎస్ మద్దుతూ ఇస్తోందన్నారు. కోదండరాం తమకు మద్దతివ్వడం సంతోషంగా ఉందన్నారు
గత ప్రభుత్వ హయాంలో కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ఉన్నా చేసిందేమీ లేదన్నారు మంత్రి వివేక్. తాము రెండు నెలల నుంచి గల్లీగల్లీ తిరిగి సమస్యలు పరిష్కరించామన్నారు. జూబ్లీహిల్స్ ను రోల్ మోడల్ గా తీర్చి దిద్దుతామని చెప్పారు. ఇటీవలే అజారుద్దీన్ ను మంత్రిని చేశామని..ఆరు నెలల్లోపు ఎమ్మెల్సీగా గెలిపిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 మందిని చైర్మన్ లను చేశాం.. జిల్లాలో మైనార్టీలకు పదవులు ఇచ్చామన్నారు వివేక్..
కోదండరాం పేరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు మంత్రి అజారుద్దీన్. తెలంగాణ కోసం గొప్ప పోరాటం చేశారన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన తనకు చాలా మంది మద్దతుగా నిలిచారని.. ఇప్పుడు నవీన్ యాదవ్ మద్దతిచ్చి గెలిపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే తప్పకుండా నెరవేరుస్తుందన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయని పని కాంగ్రెస్ పార్టీ చేసిందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు అజారుద్దీన్.
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తెలంగాణ జన సమితి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతు ఇస్తుందన్నారు కోదండరాం. ఎన్నికల తరువాత కూడా కాంగ్రెస్ తో కలిసి పని చేస్తామన్నారు. జూబ్లీహిల్స్ లో జన సమితి నాయకులు పూర్తిగా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని తీర్మానం చేశామన్నారు కోదండరాం.
