
- డిపార్ట్మెంట్పై రెగ్యులర్గా రివ్యూలు చేపడ్తానని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కార్మిక చట్టాల అమలులో నిర్లక్ష్యం చేయొద్దని అధికారులను కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశించారు. కార్మికశాఖపై సెక్రటేరియెట్లో గురువారం ఆయన రివ్యూ చేశారు. రెండు గంటల పాటు ఈ సమీక్ష జరిగింది. కార్మిక చట్టాలు, అమలు తీరు, శాఖలో ప్రస్తుతం అమలవుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్కీమ్ లు, ఎంప్లాయీమెంట్ ట్రైనింగ్ , ఈఎస్ ఐపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఇకపై రెగ్యులర్గా డిపార్ట్ మెంట్ పై రివ్యూ చేస్తానని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. రాష్ట్రంలో రూ. 2,070 కోట్లతో 46 అడ్వాన్సుడ్ ట్రైనింగ్ సెంటర్ల (ఏటీసీ) ఏర్పాటుపై అధికారులకు ఆయన పలు ఆదేశాలు ఇచ్చారు. రివ్యూలో కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, డిప్యూటీ కమిషనర్ గంగాధర్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి సేవలో..
కార్మిక, మైనింగ్ శాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన వివేక్ వెంకటస్వామి.. సతీసమేతంగా గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి వివేక్ దంపతులకు రంగనాయక మండపంలో వేద పండితులు ఆశ్వీరచనం చేశారు. టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.