- ఇన్ని పథకాలు ఇప్పటి వరకు
- ఏ పార్టీ అమలు చేయలేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి
- జూబ్లీహిల్స్లో ఇంటింటి ప్రచారం
జూబ్లీహిల్స్, వెలుగు: కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమం సాధ్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు తమ ప్రజా ప్రభుత్వం ఇచ్చినన్నీ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి ఏ ప్రభుత్వానికి కూడా ధైర్యం సరిపోలేదన్నారు. రానున్న రోజుల్లో ప్రజల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా మంగళవారం షేక్పేటలోని వినాయక నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని చెప్పారు. మహిళలకు ఫ్రీ బస్, 200 యూనిట్లు ఉచిత కరెంట్, గ్యాస్ సబ్సిడీ, సున్నా వడ్డీకే రుణాలు, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డుల పంపిణీ తదితర పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ‘‘గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోయింది. ఆ పార్టీ నాయకులు వాళ్ల అభివృద్ధి కోసం మాత్రమే పని చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత పదేండ్లుగా జరిగిన అభివృద్ధి ఏమీ లేదు. మా ప్రభుత్వ హయాంలోనే షేక్పేటలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఇలాగే కొనసాగాలంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి” అని పిలుపునిచ్చారు.
అభివృద్ధిని చూసి ఓటు వేయండి: మంత్రి సీతక్క
జూబ్లీహిల్స్ఉప ఎన్నికలో అభివృద్ధిని చూసి ఓటు వేయాలని మంత్రి సీతక్క కోరారు. బోరబండ డివిజన్ అన్నా నగర్, పెద్దమ్మ నగర్లో ఆమె పర్యటించారు. స్థానిక సమస్యలు పరిష్కరించే సత్తా నవీన్ యాదవ్కు ఉందని, ఆయన సారథ్యంలో జూబ్లీహిల్స్ రూపురేఖలు మారిపోతాయన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే నవీన్ యాదవ్ను గెలిపించుకోవడం ద్వారా అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు.
