హైదరాబాద్: ఫుట్బాల్ సంచలనం, అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీకి ఫలక్ నుమా ప్యాలెస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. మెస్సీకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆప్యాయంగా స్వాగతించారు. గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా శనివారం (డిసెంబర్ 13) మెస్సీ హైదరాబాద్కు వచ్చారు. కోల్కతా నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మెస్సీ భారీ బందోబస్తు నడుమ అక్కడి నుంచి నేరుగా ఫలక్ నుమా ప్యాలెస్కు వెళ్లారు. ఫలక్ నుమా ప్యాలెస్లో మెస్సీకి సీఎం రేవంత్ రెడ్డి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
ఆ తర్వాత గోట్ ఇండియా టూర్లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక మీట్-అండ్-గ్రీట్ కార్యక్రమంలో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉప్పల్ స్టేడియంలో మెస్సీ మ్యాచ్ చూసేందుకు హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఫలక్ నుమా ప్యాలెస్లో జరిగిన మీట్ అండ్ గ్రీట్లో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మెస్సీని కలిశారు. ఈ కార్యక్రమం తర్వాత మెస్సీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఉప్పల్ స్టేడియానికి వెళ్లనున్నారు.
అనంతరం సీఎం రేవంత్, మెస్సీ జట్లు ఫ్రెండ్లీ మ్యాచులో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కల్చరల్ ఈవెంట్లో ఆసార్క్ అవార్డ్ విన్నర్, తెలంగాణ ఫేమస్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అలరించారు. నాటు నాటు సాంగ్తో ఆడి పాడి స్టేడియంలోని ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఫోక్ సింగర్ మంగ్లీ కూడా ఆట, పాటతో హోరెత్తించింది.
రాహుల్, మంగ్లీ మ్యూజికల్ ఫెర్ఫామెన్స్తో స్టేడియం దద్దరిల్లింది. లేజర్ షో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మరోవైపు మెస్సీ మ్యాచ్ను కళ్లారా చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియం దగ్గర భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. కోల్ కతా ఘటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు.

