కేటీఆర్ పని ఖతం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 30 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నం : మంత్రి వివేక్ వెంకటస్వామి

కేటీఆర్ పని ఖతం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 30 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నం : మంత్రి వివేక్ వెంకటస్వామి
  • ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు  అండగా ప్రజలు
  • రాబోయే లోకల్​బాడీ ఎలక్షన్స్​లోనూ కాంగ్రెస్ దే విజయం 


కోల్​బెల్ట్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 25 నుంచి 30 వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారని.. ఈ  ఎన్నికలో హస్తం పార్టీ విజయంతో కేటీఆర్ పని ఖతం కానుందని కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు  ప్రజలు అండగా నిలిచారని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్​లోనూ కాంగ్రెస్సే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. 

మంచిర్యాల జిల్లా భీమరం మండలం గొల్లవాగు ప్రాజెక్ట్ లో చేప పిల్లలను వదిలారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ‘రెండు నెలలుగా జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్​రెడ్డి ఆదేశాలతో ఇన్​చార్జులుగా  నేను, సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావుతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు, డివిజన్లు, బూత్ లీడర్లు, కార్పొరేషన్ చైర్మన్లు చాలా శ్రమించాం. రెండు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చాం. జూబ్లీహిల్స్ లోనూ మత్యకారులు కాంగ్రెక్ పార్టీకి మద్దతు ఇచ్చారు. నూరు శాతం రాయితీపై రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, గుంటల్లో ఉచితంగా చేప పిల్లలు వేస్తున్నం. చెన్నూరులో మోడల్ ఫిష్ సెంటర్ ఏర్పాటు చేస్త. గొల్లవాగు ప్రాజెక్టును మా నాన్న కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి హయాంలో కట్టారు’ అని వివేక్ గుర్తుచేశారు.

75% మార్కులొస్తే ఉచిత విద్య (బాక్స్)

75% మార్కులు వచ్చిన విద్యార్థులకు తమ అంబేద్కర్ కాలేజీలో ఉచితంగా సీటు ఇస్తామని, ఇందుకు గానూ రూ.80 లక్షల వరకు ఖర్చు చేసినట్లు మంత్రి వివేక్​ తెలిపారు. విశాఖ ట్రస్ట్ నుంచి కూడా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో రూ.2.5 కోట్లతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలిక జూనియర్ కాలేజీ నూతన భవనాన్ని  కలెక్టర్ కుమార్ దీపక్​తో కలిసి ప్రారంభించారు. 

ఈసందర్భంగా వివేక్ విద్యార్థులు మంచిగా చదువుకొని  తల్లిదండ్రుల ఆశయాలను కొనసాగించాలి సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం టీచర్ల కొరత లేదని  స్పష్టం చేశారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక 51 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. తాను చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధిలో మొదటగా విద్యకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ఎక్కడ సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.