హైదరాబాద్, వెలుగు: మేడారం సమ్మక్క-సారక్క మహా జాతరకు రావాలని కోరుతూ మంత్రులు, ఆలయ పూజరులు సీఎం రేవంత్ రెడ్డికి సోమవారం ఆహ్వానం అందించారు. ఈ మేరకు మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆలయ పూజారులు సీఎంను అసెంబ్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు.
వనదేవతల పండుగకు సంబంధించిన ఆహ్వానపత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మేడారం మహా జాతర ప్రచార పోస్టర్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. జాతర ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రులు సీఎంకు వివరించారు.
ఐనవోలు ఉత్సవాలకు..
మరోవైపు, చారిత్రక ఐనవోలు మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు.
