జిల్లా అభివృద్ధికి కృషి .. లబ్ధిదారులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి : వివేక్ వెంకటస్వామి

జిల్లా అభివృద్ధికి కృషి .. లబ్ధిదారులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి : వివేక్ వెంకటస్వామి
  • మంత్రులు జూపల్లి, వివేక్​వెంకటస్వామి 
  • ఆదిలాబాద్​జిల్లాలో శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాలు
  • రివ్యూలో నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించిన ఎమ్మెల్యేలు

ఆదిలాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తామని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ ​వెంకటస్వామి అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో గురువారం ఆదిలాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతకుముందు జిల్లాకు మొదటిసారిగా వచ్చిన మంత్రులకు నేతలు ఘన స్వాగతం పలికారు. మావల బైపాస్ నుంచి ర్యాలీగా వచ్చిన మంత్రులు ముందుగా కుమ్రం భీమ్ చౌక్​లో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. 

అక్కడి నుంచి గాంధీ పార్కుకు వెళ్లి గాంధీ విగ్రహాన్ని శుద్ధి చేసి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌక్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. అక్కడి నుంచి జడ్పీ మీటింగ్ హాల్​కు చేరుకున్న మంత్రులకు కలెక్టర్, అధికారులు స్వాగతం పలికారు. సమీక్ష సమావేశంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు రాజర్షి షా, అభిలాష అభినవ్, వెంకటేశ్ ధోత్రే, కుమార్ దీపక్, ఎస్పీలు అఖిల్ మహాజన్, క్రాంతిలాల్ పాటిల్, జానకీ షర్మిల, ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, గడ్డం వినోద్, అనిల్ జాదవ్, మహేశ్వర్ రెడ్డి, బొజ్జు పటేల్, కోవ లక్ష్మి, హరీశ్ బాబు, రామారావు పటేల్, ఎమ్మెల్సీ దండే విఠల్​ హాజరయ్యారు. దీంతో చాలా రోజుల తర్వాత జెడ్పీ మీటింగ్ హాల్ కళకళలాడింది. 

సమస్యలు పరిష్కరించండి

రివ్యూలో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. చనాఖా, కోర్టా బ్యారేజ్ కోసం నిధులు మంజూరు చేయాలన్నారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో డాక్టర్ల నియామకం, ఎయిర్ పోర్ట్ ఏర్పాటు పురోగతి పనులు చేపట్టాలని కోరారు. రైతులకు ఫసల్ బీమా అమలు చేయాలని, రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. 

వెడ్మ బొజ్జు పటేల్​మాట్లాడుతూ.. ఏజెన్సీలో ఎన్నో ఏండ్లుగా నాన్ ట్రైబల్స్ సాగు చేసుకుంటున్న భూముల్లో ఫారెస్ట్ అధికారులు కందకాలు తవ్వుతున్నారని, వారితో కఠినంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫారెస్ట్ ఏరియాల్లోని చెక్ పోస్టుల్లో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని మంత్రులు దృష్టికి తీసుకెళ్లారు. బోథ్ మండలంలో కుప్టి ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని, గతంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇచ్చిన హామీ ప్రకారం బుగ్గారం, పిప్రి, పొచ్చర లిఫ్ట్ ఇరిగేషన్ కు నిధులు మంజూరు చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక తీసుకెళ్లకుండా తహసీల్దార్లు అడ్డుకుంటున్నట్లు తెలిపారు. బోథ్ పీహెచ్సీలో డాక్టర్లను నియమించాలని కోరారు. 

నిధులు కేటాయించాలి

బాసర సరస్వతి అమ్మవారి ఆలయం శిథిలావస్థకు చేరుకుందని, అభివృద్ధికి నిధులు కేటాయించాలని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ కోరారు. గ్రామ పంచాయతీల్లో నిధులు లేక అభివృద్ధి జరగడం లేదని, గతంలో సర్పంచ్​లు చేసిన పనులకు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. చాలా మంది రైతులకు రైతు భరోసా డబ్బులు రాలేదని.. దీంతో సాగు పనులు చేసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.

 ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్ రోడ్డు పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు. వెనుకబడిన ఆసిఫాబాద్ జిల్లా అభివృద్ధికి చొరవచూపాలన్నారు. తాను సర్పంచ్ గా పోటీ చేసిన సమయంలో వివేకన్న తన కోసం ప్రచారం చేసేందుకు వచ్చారని గుర్తు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు ట్రైబల్ వెల్ఫేర్ కింద విడుదల చేయాలని ఎంపీ గోడం నగేశ్ సూచించారు. అనంతరం ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై ఆయా జిల్లాల కలెక్టర్లు మంత్రులకు వివరించారు.

మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి కుటుంబానికి మంత్రుల పరామర్శ

జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకటస్వామి మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి కుటుంబసభ్యులను కలిశారు. రాంచంద్రారెడ్డి ఫొటోకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సీనియర్ లీడర్లు సంజీవ్ రెడ్డి, సాజిద్ ఖాన్, గండ్రత్ సుజాత మంత్రులను రాంచంద్రారెడ్డి నివాసంలో సన్మానించారు. అనంతరం పలువురు పార్టీ నాయకులు, మాల సంక్షేమ సంఘం నాయకులు మంత్రి వివేక్​ను శాలువాలతో 
సత్కరించారు. 

 అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రులు

సమీక్ష సమావేశం అనంతరం ఇంటర్, టెన్త్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు మంత్రులు ట్యాబ్​లు అందజేశారు. మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. అక్కడి నుంచి తలమడుగు మండలం కేంద్రానికి చేరుకున్న మంత్రి జూపల్లి కొత్తగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. మొక్కలు నాటారు. అనంతరం కేఆర్కే కాలనీలోని నగర్​లో రూ.1.40 కోట్లతో నిర్మించిన కామన్ సర్వీస్ సెంటర్​ను ప్రారంభించారు.