- మైనారిటీ శాఖ మంత్రి అజారుద్దీన్
- ఫుడ్ పాయిజన్ ఘటన బాధాకరమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో వక్ఫ్ భూములను రక్షిస్తామని మైనారిటీ శాఖ మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. రాష్ర్టవ్యాప్తంగా వక్ఫ్ పరిధిలో 63,180 ఎకరాల భూములు ఉండగా.. 16,700 మాత్రమే రికార్డుల్లో నమోదయ్యాయని ఆయన తెలిపారు.
మిగతా భూములను ఉమ్మీద్ పోర్టల్ లో అప్ లోడ్ చేస్తామని, ఇందుకోసం కొంత టైమ్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగామని చెప్పారు. మంగళవారం సెక్రటేరియెట్ లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి అజారుద్దీన్ మీడియాతో మాట్లాడారు. తప్పుడు పత్రాలతో భూములను అప్ లోడ్ చేస్తే రిజెక్ట్ అవుతాయని మంత్రి హెచ్చరించారు. మైనారిటీ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు దురదృష్టకరమని మంత్రి అన్నారు.
ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై విచారణకు ఆదేశించామని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల పై చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు ఫుడ్ వడ్డించే 30 నిమిషాల ముందు అధికారులు, సిబ్బంది ఆ ఆహారం తినాలని అదేశించామని వెల్లడించారు.
