ఈ సండే కాస్త వెరైటీగా తినాలంటే..ఒక్కసారి ఇవి ట్రై చేయండి

ఈ సండే కాస్త వెరైటీగా తినాలంటే..ఒక్కసారి ఇవి ట్రై చేయండి

చినుకులు పడే వేళ.. వేడి వేడిగా పకోడీలు తినాలనిపించడం చాలా కామన్. ఈ సీజన్​లో ఒక్కసారైనా ప్రతి ఇంట్లో ఉల్లిపాయ పకోడీలు వేసుకోవడం కూడా అంతే నేచురల్​. కానీ, కాస్త వెరైటీగా తినాలంటే మాత్రం ఇవి ట్రై చేయాల్సిందే. నాన్​ వెజ్ ప్రియులకు రొయ్యలు, వెజ్​ లవర్స్​కి పనీర్.. ఏదైనా పర్లేదు ఫ్లేవర్​ ఫుల్​గా కావాలంటే మింట్​, కాజూ కాంబినేషన్ అదిరిపోతుంది. మరింకేం..  మూడు వెరైటీలు ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివేయండి. 

కావాల్సినవి :
శనగపిండి – రెండు కప్పులు
బియ్యప్పిండి – నాలుగు టేబుల్ స్పూన్లు
పసుపు – అర టీస్పూన్
కారం – మూడు టీస్పూన్లు
ఇంగువ, జీలకర్ర పొడి – ఒక టీస్పూన్
వేడి నూనె  – పావు కప్పు, జీడిపప్పు – ఒక కప్పు
కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, నీళ్లు, నూనె – సరిపడా


పుదీనా – జీడిపప్పు

తయారీ : ఒక మిక్సీజార్​లో పుదీనా, కొత్తిమీర వేసి నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, పసుపు, ఉప్పు, కారం, ఇంగువ వేసి బాగా కలపాలి. తర్వాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు వేసి మరోసారి కలపాలి. పాన్​లో నూనె వేడి చేయాలి. ఆ నూనెని పిండి మిశ్రమంలో వేసి కలపాలి. ఆ తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసి, నీళ్లు పోసి బాగా కలపాలి. పాన్​లో నూనె వేసి వేడి చేసి రెడీ చేసి పెట్టుకున్న ఆ మిశ్రమంలో నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని పకోడీల్లా వేయాలి. 


రొయ్యల పకోడీ

కావాల్సినవి :
రొయ్యలు – 300 గ్రాములు
కార్న్​ ఫ్లోర్ – మూడు టేబుల్ స్పూన్లు
కారం – రెండు టీస్పూన్లు, గరం మసాలా, వెల్లుల్లి పేస్ట్ – ఒక్కో టీస్పూన్
నిమ్మరసం – అర టీస్పూన్
నీళ్లు, ఉప్పు – సరిపడా

తయారీ : ఒక గిన్నెలో కార్న్​ఫ్లోర్, కారం, గరం మసాలా, నిమ్మరసం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి నీళ్లు పోసి బాగా కలపాలి. రొయ్యలు కూడా వేసి కలపాలి. పాన్​లో నూనె వేసి వేడి చేసి అందులో రొయ్యల్ని వేసి వేగించాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్​లోకి తీసుకోవాలి. 


పనీర్​తో

కావాల్సినవి :
పనీర్ – అర కిలో
శనగపిండి, బియ్యప్పిండి, మైదా – ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్లు, ఇంగువ – పావు టీస్పూన్, వాము, పసుపు, నిమ్మరసం – ఒక్కోటి అర టీస్పూన్, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం – ఒక్కో టీస్పూన్, ఉప్పు, నీళ్లు, నూనె – సరిపడా, ఆమ్​చూర్ పొడి – కొంచెం

తయారీ : ఒక గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, మైదా, వాము, పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం, నిమ్మరసం, ఉప్పు వేసి నీళ్లు పోసి బాగా కలపాలి. ఒక ప్లేట్​లో పనీర్ ముక్కలు వేసి ఉప్పు చల్లాలి. వాటిని రెడీ చేసి పెట్టుకున్న పిండిలో వేసి కలపాలి. పాన్​లో నూనె వేడి చేసి అందులో పనీర్ ముక్కలు వేసి వేగించాలి. వాటిని ప్లేట్​లోకి తీసుకుని, ఆమ్​ చూర్ పొడి చల్లుకుని తింటే టేస్ట్​ అదిరిపోతుంది.