
రాజన్న సిరిసిల్ల, వెలుగు : ‘సిరిసిల్ల జిల్లాలో వడ్ల కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి.. రైతును రాజు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.. కేంద్రమంత్రి బండి సంజయ్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి’ అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీస్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో జరిగిన కొనుగోళ్లకు, ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న కొనుగోళ్లకు తేడా తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.
బీఆర్ఎస్కు బీ టీమ్లా బీజేపీ పనిచేస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పిన సీఎం రేవంత్రెడ్డి మాటలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి ఆడంబరాలకు పోకుండా రాష్ట్ర ప్రజల కోసం 18 గంటలు కష్టపడుతూ, ఒక్కో హామీని అమలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పోర్ట్స్, స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తే.. బీఆర్ఎస్, బీజేపీలు దుబాయ్ కేంద్రంగా వాట్సప్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి విద్వేష ప్రచారాలు చేస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థత కండ్లకు కట్టినట్లు కనిపిస్తోందన్నారు.
ఎమ్మెల్సీ కవిత బీసీలకు నాయకత్వం వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేటీఆర్, బండి సంజయ్ ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుగుల స్వరూపారెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు పాల్గొన్నారు.