ఫోన్ ​ట్యాపింగ్ ​పేరుతో కాంగ్రెస్​ డ్రామాలు : జగదీశ్​ రెడ్డి

ఫోన్ ​ట్యాపింగ్ ​పేరుతో కాంగ్రెస్​ డ్రామాలు : జగదీశ్​ రెడ్డి
  • లీకులు, ఫేక్​ వార్తలతో కాలం గడుపుతున్నరు
  • కేసీఆర్​ను ఎవరూ టచ్​చేయలేరు

మిర్యాలగూడ వెలుగు : ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాంగ్రెస్​ ప్రభుత్వం కొత్త డ్రామా మొదలుపెట్టిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్​రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే ఫేక్, లీక్​వార్తలని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు బయటకు రాకుండా కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని టీఎన్ఆర్ గార్డెన్స్ లో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్​రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా మళ్లీ వాటర్ ట్యాంక్లర్ల ద్వారా నీళ్ల సరఫరా జరుగుతోందన్నారు. 

ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. నల్గొండ జిల్లా మంత్రులు కేసుల పేరుతో రైస్ మిల్లర్లను బెదిరించి డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ను ఏదో చేస్తామని కాంగ్రెస్​కలలు కంటోందని, ఆయనను ఎవరూ టచ్​కూడా చేయలేరన్నారు. ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్,  ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కరరావు, రాతిప్పన విజయసింహారెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, రవీందర్ నాయక్, డీసీఎంఎస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి పాల్గొన్నారు.