హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం : గువ్వల బాలరాజు

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం : గువ్వల బాలరాజు

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు అచ్చంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రకటించారు. సీబీఐ ఎంక్వైరీకి ఓకే చెప్పడమంటే ప్రజాస్వామ్యాన్ని అగౌరపరచడమేనని అన్నారు. ఈడీ, సీబీఐలను జేబు సంస్థలుగా వాడుకుంటున్న కేంద్రం వాటితో తమను ఇబ్బంది పెట్టాలని చూస్తోందని గువ్వల ఆరోపించారు. దుర్మార్గమైన పాలన నడిపిస్తున్న కేంద్రంపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ సర్కారును కూల్చే కుట్ర ఎవరు చేశారో అందరికి తెలుసన్న ఆయన.. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం తమను ఇబ్బంది పెడితే సహించేదిలేదని హెచ్చరించారు. 

దోపిడీ, స్వార్ధం లేని పాలన 

రాష్ట్ర బడ్జెట్ అంచెలంచెలుగా పెరుగుతూ వస్తోందని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. దోపిడీ, స్వార్ధం లేని పాలనను సీఎం కేసీఆర్ అందిస్తున్నారని చెప్పారు. మానవీయ కోణం, సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయని, రూ. 2.90 లక్షల కోట్ల బడ్జెట్ ​ఉమ్మడి రాష్ట్రంలో కూడా సాధ్యం కాలేదని అన్నారు. కేంద్రానిది అదానీ, అంబానీ బడ్జెట్ అయితే రాష్ట్రానిది పేదల బడ్జెట్ అని చెప్పారు.