పీసీసీ అధ్యక్ష పదవిపై తాను చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని కూడా అన్నారు. మంగళవారం గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని వ్యతిరేకించడం అనేది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. రేవంత్ రెడ్డి నేను పార్టీలోనే కొనసాగుతాం అని అన్నారు.
సీఎం కు, హరీశ్ కు ఉన్నట్లే మాకూ భేదాబిప్రాయాలున్నాయ్
పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్నప్పుడు కొన్ని హద్దులు ఉంటాయని, తాను మాట్లాడినంత ఫ్రీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడలేకపోవొచ్చనని జగ్గారెడ్డి అన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ క్లాస్ తీసుకుంటే తప్పేమీ లేదని, పీసీసీ హోదాలో మందలింపులు అనేది కామనే అని అన్నారు. తాను మాట్లాడిన మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇబ్బంది కలిగించవచ్చనని, అయితే ఉత్తమ్ మందలించినంత మాత్రాన తానేం ఫీల్ కానని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో పీసీసీ పంచాయితీలు మామూలేనని అన్నారు. మంత్రి హరీష్ రావుకు , సీఎం కెసిఆర్ కు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లే.. కాంగ్రెస్ లో కూడా భేదాభిప్రాయాలు ఉండడం కామనే అని అన్నారు. చిన్న పార్టీ టిఆర్ఎస్ లో నే భేదాభిప్రాయాలు ఉంటే ….కాంగ్రెస్ లో ఎందుకు ఉండవు అని అన్నారు.
పదవి రేస్ లో సీరియస్ గానే ఉన్నా
పీసీసీ అధ్యక్ష పదవి విషయమై.. ఢిల్లీకి వెళతానని.. సమయం వస్తే కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ కూడా రాస్తానని జగ్గారెడ్డి తెలిపారు. పదవి రేస్ లో సీరియస్ గానే ఉన్నానని, తనకు కాకుంటే ఎవరికి ఇవ్వాలో కూడా చెప్తానని అన్నారు. ఇప్పటికీ బలమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో ఉందని అన్నారు. ఉత్తమ్ ను పీసీసీ నుంచి ఇప్పుడే తొలగిస్తారని అనుకోవడం లేదన్నారు . ఇది కాంగ్రెస్- టీఆరెస్ పార్టీ కాదు- టీఆరెస్ పార్టీలో కేసీఆరే ఫైనల్ నిర్ణయం- కాంగ్రెస్ లో అలా కాదు అని జగ్గారెడ్డి అన్నారు.
