
- ఆయనకు ఎవరూ సరిగా బ్రీఫింగ్ ఇవ్వడం లేదు : కడియం
హైదరాబాద్, వెలుగు : ‘‘సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేదా? ఆయనకు ఎవరూ సరైన బ్రీఫింగ్ఇవ్వడం లేదా?’’ అనే సందేహం కలుగుతోందని మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఫార్మా సిటీ రద్దు, మెట్రో రైలు అలైన్మెంట్ మార్పు లాంటి విషయాల్లో మూడు నాలుగు రోజుల్లోనే మాట మార్చడం చూస్తుంటే అదే అనుమానం కలుగుతోందన్నారు. సీఎం కనీసం హోం వర్క్ చేయకుండా మాట్లాడుతున్నారని అనిపిస్తోందన్నారు. సీఎం నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే.. అది జీవోతో సమానమని ఆయన అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నాగ్పూర్లో నిర్వహించిన కాంగ్రెస్ అవిర్భావ సభలో దేశానికి అదానీ, ప్రధాని పీడ పట్టిందన్న రేవంత్.. కొన్ని రోజుల్లోనే అదే అదానీకి రెడ్ కార్పెట్తో స్వాగతం పలికారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలు ప్రారంభించకపోగా.. గత ప్రభుత్వ పథకాలను రద్దు చేస్తోందన్నారు.
ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదని, గృహలక్ష్మిలో ఇంటి నిర్మాణం ప్రారంభించిన లబ్ధిదారులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. 6 గ్యారంటీల్లో రెండు గ్యారంటీలు అమలు చేశామని ప్రచారం చేసుకుంటున్నారని.. ఏ గ్యారంటీలు అమలు చేశారో స్పష్టత ఇవ్వాలన్నారు. తాము తొందరపడి విమర్శలు చేయడం లేదని.. కాంగ్రెస్హామీలు డిసెంబర్9న అమలు చేస్తామన్న విషయాన్ని గుర్తు చేస్తున్నామని తెలిపారు. తాము కాంగ్రెస్ పార్టీని చార్సౌ బీస్అని అనడం లేదని.. కాంగ్రెస్ హామీల సంఖ్య 420 అని వాళ్ల హామీల సంఖ్య మాత్రమే గుర్తు చేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం ప్రజా దర్బార్లో ప్రజలను కలుస్తానని చెప్పుకున్నారని, ఇప్పుడు మంత్రులు కూడా ఆ కార్యక్రమానికి రావడం లేదన్నారు. పెద్దపల్లి ఎంపీ సీటును గెలవడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామని ఎమ్మెల్సీ భానుప్రసాద్రావు అన్నారు.