పేదల కంటి సమస్యను పరిష్కరిస్తా : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

పేదల కంటి సమస్యను పరిష్కరిస్తా  : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చండూరు, వెలుగు : పేదల కంటి సమస్యను పరిష్కరించేందుకు ఐ ఆస్పత్రిని నిర్మిస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం చండూరు మండలం బంగారిగడ్డ గ్రామంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫినిక్స్  ఫౌండేషన్, శంకరా కంటి ఆస్పత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన 6వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటి వైద్య శిబిరం అనేది రాజకీయాలతో సంబంధం లేదన్నారు. 

పేదల కోసం ఆరు నెలలుగా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఐదు విడతలుగా నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 853 మందికి ఆపరేషన్లు చేయించామని వివరించారు. గత ప్రభుత్వం కమీషన్ల కోసమే కాళేశ్వరం నిర్మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఓంకారం, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కోడి శ్రీనివాసులు, చండూరు మున్సిపల్ అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.