స్టీఫెన్ రవీంద్రపై చర్యలు తీసుకోండి... ఈసీకి రఘునందన్ రావు ఫిర్యాదు

స్టీఫెన్ రవీంద్రపై చర్యలు తీసుకోండి... ఈసీకి రఘునందన్ రావు ఫిర్యాదు

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చట్ట విరుద్ధంగా వ్యవహరించారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా బీజేపీ ప్రతిష్టను దెబ్బ తీసేలా ఆయన ప్రవర్తించారని మండిపడ్డారు. ఈ మేరకు ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం ఓ పెద్ద జిమ్మిక్కు అని ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఇప్పటికే ఈడీకి ఫిర్యాదు చేశామని, అందుకు సంబంధించిన కాపీని లేఖకు జతపరచామని రఘనందన్ రావు తెలిపారు.

మునుగోడు ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచేందుకు సదరు పోలీసు అధికారి సహకరిస్తున్నారని కంప్లైంట్ చేశారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేలా చూడాలని, సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు ఈసీని కోరారు.