టీఆర్ఎస్ బ్యానర్ల ఏర్పాటుపై రాజాసింగ్ ఫైర్

టీఆర్ఎస్ బ్యానర్ల ఏర్పాటుపై రాజాసింగ్ ఫైర్

ఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా సిటీ అంతటా బ్యానర్లు ఏర్పాటు చేయడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో టీఆర్ఎస్ పార్టీ బ్యానర్లు పెట్టినప్పుడల్లా జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ లీవ్ లో వెళ్తున్నారని అన్నారు. గతంలో కూడా ఆ పార్టీ బ్యానర్లు, కటౌట్లు పెట్టినప్పుడు ఆయన సెలవుపై వెళ్లిపోయిన విషయాన్ని రాజాసింగ్ గుర్తు చేశారు. బహుశా బీజేపీ ప్రశ్నిస్తుందనే కారణంతోనే ఆయన లీవ్ పెట్టి వెళ్లిపోతుండొచ్చని అన్నారు. 

నగరంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు పెడితే తొలగిస్తామని చెప్పిన మంత్రి కేటీఆర్.. జీవో కూడా విడుదల చేశారని రాజాసింగ్ అన్నారు. దాన్ని చూపుతూ గతంలో బీజేపీ బ్యానర్లు తొలగించినట్లు చెప్పారు. ఆ జీవో కేవలం బీజేపీకి మాత్రమే వర్తిస్తుందేమోనని సందేహం వ్యక్తంచేశారు. సిటీలో ఎటు చూసినా గులాబీ పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లే కనిపిస్తున్నాయని.. వాటిని చూస్తే సదరు జీవో టీఆర్ఎస్కు వర్తించదేమోనన్న అనుమానం కలుగుతోందని అన్నారు. రాత్రికల్లా టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కట్టిన బ్యానర్లును జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తొలగించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీజేపీ మీటింగ్ ల సమయంలో ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు, కటౌట్లను తొలగించొద్దని అన్నారు.