ములుగు ప్రాంతాన్ని ఎడారిగా మార్చే కుట్రను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు ఎమ్మెల్యే సీతక్క. ఏటూరు నాగారం దేవాదుల వద్ద తలపెట్టిన జలదీక్షను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో అర్ధరాత్రి నుండి గృహ నిర్భంధంలోనే ఉన్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణ అదిలాబాద్ నుండి ఖమ్మం వరకు మొత్తం గోదావరి పరివాహక ప్రాంతం ఈ ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వకుండా.. ఇతర ప్రాంతాలకు నీళ్ళు తీసుకుపోయే కుట్ర జరుగుతుందన్నారు.
9మండలాల్లో తలుపునే గోదావరి ఉన్న తాగటానికి నీళ్ళు లేవని ములుగు నియోజకవర్గం గుండా గోదావరి జలాలు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఇతర ప్రాంతాలకు తీసుకుపోతున్నారన్నారు. రామప్పలో లిఫ్ట్ ఏర్పాటు చేసి నర్సంపేట, జనగాం ప్రాంతాలకు తీసుకుపోతున్నారు తప్ప.. ఈ ప్రాంతానికి చుక్క నీరు ఇవ్వకపోవడం దారుణమన్నారు. దీనికి నిరసన గా టీపీసీసీ ఆదేశాల మేరకు చేపట్టిన జల దీక్షను అడ్డుకోవడం ముఖ్యమంత్రికి తగదని.. అక్రమ అరెస్ట్ తో మా దీక్షను అడ్డుకోలేరని ప్రభుత్వంపై మండిపడ్డారు సీతక్క. ముఖ్యమంత్రి గారు వెనుకబడిన ప్రాంతాలపై వివక్షత చూపుతున్నారని.. మీ ఒక్క ప్రాంతానికే మీరు ముఖ్యమంత్రి కాదని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గోదావరిని అనుకోని ఉన్న ఏటూరు నాగారం మంగపేట వద్ద చెక్ డ్యాంలు నిర్మించాలని.. గోవిందరావు పేట లక్నవరం చెరువు వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేయాలన్నారు. కొత్తగూడ మండలం పాకాల చెరువు వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి, ఇక్కడి ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చిన తర్వాతే పక్క ప్రాంతాలకు నీళ్ళు తీసుకుపోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే సీతక్క.